Madras High Court: ఈడీపై మద్రాసు హైకోర్టు ఆగ్రహం
ఈడీపై మద్రాసు హైకోర్టు ఆగ్రహం
Madras High Court : ప్రతి నేరానికీ సంబంధించి దాడులు నిర్వహించడానికి మీరు డ్రోన్ కాదని, అలాగని మీ దృష్టికి వచ్చిన ప్రతిదానిపై విచారణ చేపట్టడానికి మీరు ‘సూపర్ కాప్’ కూడా కాదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)ను ఉద్దేశించి మద్రాస్ హైకోర్టు (Madras High Court) వ్యాఖ్యానించింది. చెన్నైకి చెందిన ఆర్కేఎం పవర్జెన్ ప్రైవేట్ లిమిటెడ్కు సంబంధించిన రూ.901 కోట్ల డిపాజిట్లను ఈడీ సీజ్ చేయడంతో దాన్ని సవాల్ చేస్తూ ఆ సంస్థ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. తాజాగా విచారించిన జస్టిస్ ఎం.ఎస్.రమేష్, జస్టిస్ వి.లక్ష్మీనారాయణన్ల ధర్మాసనం ఈడీపై పైవిధంగా వ్యాఖ్యలు చేసింది.
Madras High Court Serious on ED
ఛత్తీస్గఢ్లోని పవర్ ప్లాంటుకు బొగ్గు సరఫరాపై ఆరోపణలు రావడంతో ఆర్కేఎంపై 2014లో సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ తర్వాత దాన్ని మనీ లాండరింగ్ వ్యవహారం కింద ఈడీకి బదిలీ చేసింది. ఈ క్రమంలో ఈ ఏడాది జనవరి 31న ఆర్కేఎం సంస్థకు చెందిన ఆస్తులపై ఈడీ దాడులు చేపట్టి రూ.901 కోట్లను ఎటాచ్ చేసింది. ఈ అంశంపై విచారణ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ… ఈడీ ఎత్తిచూపిన అభియోగాలపై ఎలాంటి ఆధారాలూ దొరకనప్పుడు, ఇతర అంశాల మీద సుమోటోగా విచారణ చేపట్టే అధికారం ఈడీకి లేదని అభిప్రాయపడింది. నేరానికి సంబంధం ఉన్న వాటిని మాత్రమే సీజ్ చేసే అధికారముందని స్పష్టం చేసింది. ఈడీ చర్య తీసుకున్న వాటిమీద ఎలాంటి ఫిర్యాదు కూడా నమోదు కాలేదని పత్రాల్ని బట్టి తెలుస్తోందని పేర్కొంది. తమ దృష్టికి వచ్చిన విషయాలన్నింటిపై విచారణ చేపట్టడానికి ఈడీ సూపర్కాప్ కాదని, పీఎంఎల్ఏ కేసులోని నేరానికి సంబంధించిన వాటిమీదే చర్యలు తీసుకునేందుకు వీలుందని తేల్చి చెప్పింది.
Also Read : Missing: వీడిన తిరువూరు ఏఈఈ మిస్సింగ్ మిస్టరీ
