Mamata Banerjee: ప్రధాని మోదీకు గుడి కట్టి, ప్రసాదం పెడతానంటున్న మమతా బెనర్జీ !

ప్రధాని మోదీకు గుడి కట్టి, ప్రసాదం పెడతానంటున్న మమతా బెనర్జీ !

Mamata Banerjee: దేశ ప్రయోజనాల కోసం భగవంతుడు తనను భూలోకానికి పంపారని ఇటీవల ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తనను దేవుడే పంపాడంటూ మోదీ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ ఎద్దేవా చేస్తూ… దేవుళ్లు రాజకీయాలు చేసి అల్లర్లను ప్రేరేపించరని దీదీ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రంలో ఏర్పాటుచేసిన బహిరంగ ర్యాలీలో పాల్గొన్న దీదీ మోదీపై ఈ వ్యాఖ్యలు చేశారు.

Mamata Banerjee Comment

ఈ సందర్భంగా సీఎం మమతా మాట్లాడుతూ… ‘‘దేశ ప్రయోజనాల కోసం భగవంతుడు తనను భూలోకానికి పంపారని ప్రధాని మోదీ ఇటీవల వ్యాఖ్యానించారు. ఆయన తనను తాను మరో దేవుడిగా భావిస్తున్నారు. కానీ, దేవుళ్లు రాజకీయాలు చేయరు. అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేయరు. నిజంగా… ఆయన తనను దేవుడిగా భావిస్తే నేనొక్క విన్నపం చేసుకుంటున్నా. మోదీజీ… మీకు ఒక దేవాలయాన్ని నిర్మిస్తా. ప్రసాదంగా డోక్లా (గుజరాత్‌లో ప్రత్యేక వంటకం) పెడతా. నిత్యం పూజలు చేస్తా. దయచేసి మీరు ఆలయంలో కూర్చోండి. దేశాన్ని సమస్యల్లోకి నెట్టే ప్రయత్నాలు మానుకోండి’’ అంటూ దీదీ ఎద్దేవా చేశారు.

‘‘ఇప్పటివరకు ఎంతోమంది ప్రధానులతో కలిసి పనిచేశా. అందులో అటల్‌ బిహారీ వాజ్‌పేయ్‌ కూడా ఉన్నారు. ఆయన అందరితోనూ ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. కానీ, మోదీ లాంటి ప్రధానిని ఎప్పుడూ చూడలేదు. ఆయన అవసరం దేశానికి లేదు’’ అని మమతా వ్యాఖ్యానించారు. ఇదిలాఉండగా.. ఇటీవల బీజేపీ నేత సంబిత్‌ పాత్ర చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ… ‘పూరీ జగన్నాథుడే మోదీకి పరమభక్తుడు’ అని పొరబాటున వ్యాఖ్యానించారు. దీనిపై ప్రతిపక్షాలు భగ్గమన్నాయి. దీనితో అనుకోకుండా తప్పు జరిగిందంటూ క్షమాపణలు కోరుతూ… నోరు జారినందుకు ప్రాయశ్చిత్తంగా ఉపవాసం చేయాలని నిర్ణయించుకున్నట్లు సంబిత్‌ ఆ తర్వాత వివరణ ఇచ్చారు.

Also Read : PM Narendra Modi: నవీన్‌ పట్నాయక్‌ ఆరోగ్యం క్షీణించడంపై ప్రధాని మోదీ ఆందోళన !

Leave A Reply

Your Email Id will not be published!