Marri Rajasekhar: జగన్ వైఖరి, మోసం వల్లే ఆ పార్టీకి రాజీనామా చేసాను – మర్రి రాజశేఖర్
జగన్ వైఖరి, మోసం వల్లే ఆ పార్టీకి రాజీనామా చేసాను - మర్రి రాజశేఖర్
Marri Rajasekhar : ఎమ్మెల్సీ పదవికి, వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ ఎట్టకేలకు పెదవి విప్పారు. గురువారం పల్నాడు జిల్లా చిలకలూరిపేట లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో… వైఎస్ జగన్ చేతిలో ఎలా మోసపోయారు… ఎలాంటి అవమానాలు ఎదుర్కొన్నారు ఎలా బాధపడింది చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ… ‘‘వైసీపీ అధినేత జగన్ వైఖరి, మోసం వల్లే ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేను… 2011లో వైసీపీలో చేరా. దాదాపు 14 ఏళ్లు ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీ బలోపేతానికి కృషి చేశా.
Marri Rajasekhar Comment
2019 ఎన్నికల్లో విజయం ఖాయం అనుకుంటున్న వేళ మరో వ్యక్తిని తీసుకొచ్చి నిలబెట్టారు. పార్టీ అధికారంలోకి వస్తే నన్ను ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇస్తానని జగన్ బహిరంగంగా హామీ ఇచ్చారు. జగన్ మాట విని కార్యకర్తలు, అభిమానులు పార్టీ విజయం కోసం పనిచేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ మాట తప్పి వేరే వారికి మంత్రి పదవి ఇచ్చారు. ప్రతి ఎమ్మెల్సీ ఎన్నికల వేళ మర్రి రాజశేఖర్కు(Marri Rajasekhar) పదవి అంటూ మోసం చేశారు. పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసిన నాకు కనీస గౌరవం ఇవ్వలేదు.
చిలకలూరిపేట నుంచి గెలిచిన వ్యక్తి 2024లో గుంటూరుకు వెళ్లారు. అప్పుడు కూడా నియోజకవర్గంలో నన్ను సంప్రదించకుండా… నన్ను కాదని వేరే వారిని నిలబెట్టారు. గత ఎన్నికల్లో ఓటమి పాలైన మాజీ మంత్రి విడదల రజినీని మళ్లీ చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్గా నియమించారు. గుంటూరులో 53వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన వ్యక్తికి తిరిగి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించినప్పుడు కనీసం నన్ను, కార్యకర్తలను సంప్రదించలేదు. అందుకే వైసీపీకు రాజీనామా చేస్తున్నా. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తర్వాతే పార్టీ మారుతున్నా. ఆత్మగౌరవం కోసమే వైకాపాను వీడుతున్నా. ఎలాంటి షరతులు లేకుండానే త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరతా’’ అని మర్రి రాజశేఖర్ తెలిపారు.
Also Read : Minister Nara Lokesh: జగన్ ఆంధ్రా సద్దాం హుస్సేన్ – మంత్రి నారా లోకేష్