Marripudi SI: మహిళపై మర్రిపూడి ఎస్ఐ దౌర్జన్యం ! వైరల్ గా మారుతున్న వీడియో !
మహిళపై మర్రిపూడి ఎస్ఐ దౌర్జన్యం ! వైరల్ గా మారుతున్న వీడియో !
Marripudi SI : ప్రకాశం జిల్లా కొండపి మండలం జాళ్లపాలెంలో మర్రిపూడి ఎస్ఐ ఎ.రమేష్బాబు… ఓ మహిళపై దౌర్జన్యం చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఓ చోరీ కేసు విషయంలో దగ్గరలోని షాపులో ఉన్న సిసి కెమెరా విజువల్స్ కోసం ఒక ఇంట్లోకి ప్రవేశించిన మర్రిపూడి ఎస్ఐ(Marripudi SI) రమేష్ మహిళపై దౌర్జన్యం చేసి చేయిచేసుకున్నాడంటూ బాధితులు ప్రకాశంజిల్లా ఎస్పికి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మర్రిపూడి(Marripudi) ఎస్సై రమేష్ బాబు, అతని సిబ్బంది… మహిళలపై, తమ పిల్లలపై అసభ్యకరంగా మాట్లాడుతూ చేయి చేసుకోవటమే కాకుండా దౌర్జన్యంగా సిసి కెమెరా డివైస్ సామాగ్రిని తీసుకెళ్ళారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదేనా ఫ్రెండ్లీ పోలీసంటే అంటూ… ఎస్ఐ రమేష్ దుకాణంలోని మహిళపై దౌర్జన్యం చేస్తూ నెట్టివేస్తున్న దశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. దీనితో ఈ విజువల్స్ ఇప్పుడు వైరల్గా మారాయి.
Marripudi SI Assult on..
ప్రకాశం జిల్లా కొండపి మండలం జాళ్ళపాలెం గ్రామంలో మారంరెడ్డి కొండలరావు చిల్లర దుకాణం నిర్వహిస్తున్నాడు. గత నెల 28న కొండపి మండలం పెట్లూరు శివాలయంలో రూ.7 లక్షల విలువైన బంగారు, వెండి వస్తువులు, జరుగుమల్లి మండలం ఎన్ఎన్ కండ్రిక పంచాయతీ కొత్తపాలెం అంకమ్మ తల్లి ఆలయంలో రూ.70 వేల విలువైన వెండి వస్తువులు, హుండీలో సుమారు రూ.20 వేల నగదు చోరీకి గురయ్యాయి. ఈ కేసుల విచారణలో భాగంగా మర్రిపూడి ఎస్ఐ(Marripudi SI) రమేష్బాబు జాళ్లపాలెం వెళ్లారు. కొండలరావు షాపు వద్ద సీసీ కెమెరా ఉన్నట్టు తెలుసుకుని అతడి కుటుంబ సభ్యులను సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించాలని కోరారు. వారు యజమాని కొండలరావు లేరని చెప్పగా.. ఎస్సై రమేష్బాబు వెంటనే కొండలరావు కుమారుని ద్వారా ఫోన్ చేయించి అతడితో మాట్లాడారు. కొండలరావు ఎస్ఐతో మాట్లాడుతూ తాను ఊళ్లో లేనని, సాయంత్రం వస్తానని, పెన్డ్రైవ్ ఇస్తే సీసీ ఫుటేజీ కాపీ చేసి పంపిస్తానని చెప్పారు.
దీనితో ఎస్ఐ రమేష్బాబు తాను స్వయంగా సీసీ కెమెరా ఫుటేజీ చెక్ చేసుకుంటానని చెప్పడంతో ‘సార్ మీరు నా ఇంట్లోకి వెళ్లడానికి వీల్లేదు. మీ మీద నాకు నమ్మకం లేదు’ అని చెప్పాడు. దీనితో ఎస్సై ‘మా మీద నమ్మకం లేదా’ అనడంతో కొండలరావు ‘నమ్మకం లేదు. గత ఏడాది నవంబర్లో మర్రిపూడి మండలం జగ్గరాజుపాలెం పెట్రోల్ బంకులో నాపై దాడి జరిగిందని ఫిర్యాదు చేస్తే నన్ను మూడు గంటలపాటు నిలువరించటమే కాక మీరు నేరస్తుల పక్షాన నిలబడి నాపై తప్పుడు కేసు పెట్టమని సలహా ఇచ్చారు. నేటి వరకు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు’ అనడంతో ఎస్ఐ ఫోన్ కట్ చేశారు.
దీనితో ఎస్ఐ రమేష్ పోలీసులకు ఎక్కడికైనా వెళ్లే హక్కు ఉందంటూ ఆ సమయంలో షాపులో ఉన్న మహిళను నెట్టుకుంటూ లోపలికి వెళ్ళాడు. షాపులో ఉన్న కొండలరావు చెల్లెలు చంద్రమ్మను చేతితో నెట్టుకుంటూ ఆమెను దూషిస్తూ బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించి సీసీటీవీ ఎన్వీఆర్, మొబైళ్లు, పెన్డ్రైవ్లు జేబులో వేసుకుని వెళ్లిపోయారు. ఈ దృశ్యాలు షాపులోని సిసి కెమెరాలో రికార్డయ్యాయి… అనంతరం షాపులోని సిసి కెమెరా డివైస్ సామాగ్రిని తీసుకెళ్ళడమే కాకుండా షాపులో ఉన్న మహిళపై చేయిచేసుకున్న మర్రిపూడి ఎస్ఐ(Marripudi SI) రమేష్పై చర్యలు తీసుకోవాలని షాపు యజమాని కొండలరావు జిల్లా అదేరోజు కొండపి పోలీస్స్టేషన్కు, ఎస్పీ ఏఆర్ దామోదర్కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేశాడు. అయితే ఎస్పీ స్పందించకపోవడంతో సోమవారం జిల్లా ఎస్పీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
అయితే, మంగళవారం ఈ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. బాధితులపైనే పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంట్లోకి చొరబడి మహిళపై చేయివేసి విసిరిపడేసి… అమర్యాదగా ప్రవర్తించిన ఎస్సై రమేష్ బాబును ఎస్పీ వెనుకేసుకొచ్చారు. బాధితులపైనే కేసులు పెడుతున్నట్లు ఎస్పీ ఏఆర్ దామోదర్ మీడియా ముందు ప్రకటించారు. దళిత ఎస్ను అడ్డగించి విధులకు ఆటంకం పరిచారంటూ ఇద్దరు మహిళలతో పాటు ఇంటి యజమాని మారంరెడ్డి కొండలరావుపై అట్రాసిటీ కేసులు నమోదు చేశారు.
Also Read : KTR: కేటీఆర్ అమెరికా పర్యటన ! డాలస్ లో మహాత్ముడికి నివాళులర్పించిన కేటీఆర్ !