Masood Azhar: ‘ఆపరేషన్ సింధూర్’ లో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ ఫ్యామిలీ ఖతం
'ఆపరేషన్ సింధూర్' లో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ ఫ్యామిలీ ఖతం
పహాల్గాం ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా భారత ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ లో ప్రముఖ ఉగ్రవాద సంస్థ జైషే మమ్మద్ స్థావరం పూర్తిగా నేలమట్టమయ్యింది. ఇద్దరు మహిళా అధికారులు ఎవరీ కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్లు నాయకత్వంలో నిర్వహించిన ఆపరేషన్ లో నామ రూపాల్లేకుండా పోయింది. ‘ఆపరేషన్ సింధూర్’ లో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ అజార్ కు చావు దెబ్బ తగిలినట్లు సమాచారం. భారతీయ క్షిపణుల దాడుల్లో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ కుటుంబలో 14 మంది మృతి చెందినట్లు సమాచారం.
బహావల్పూర్ లోని జామియా మసీద్ సుభాన్ అల్లాహ్ శిబిరం సముదాయంపై భారత్ జరిపిన క్షిపణి దాడిలో అజార్ సోదరి, ఆమె భర్త, అజార్ మేనల్లుడు, అతని భార్య, మరో మేనల్లుడు, ఉమ్మడి కుటుంబంలోని ఐదుగురు చిన్నారులు చనిపోయారు. వీరితోపాటే అజార్ కు అత్యంత సన్నిహితమైన వ్యక్తి, అతని తల్లి, మరో ఇద్దరు వ్యక్తులూ మరణించారు. ఈ దాడిలో గాయపడిన వారిని దగ్గర్లోని విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. ఈ వివరాలను స్వయంగా ఆయనే పాకిస్తాన్ మీడియాకు వెల్లడించినట్లు తెలుస్తోంది.
‘ఆపరేషన్ సింధూర్’ పై జైషే చీఫ్ మసూద్ అజార్ లేఖ
‘ఆపరేషన్ సింధూర్’ పై జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ అజార్ లేఖ విడుదల చేశారు. ప్రధాని మోదీ అన్ని రకాల యుద్ధ నియమాలను ఉల్లంఘించారు. ఆపరేషన్ సిందూర్ పై నాకు భయం లేదు. నిరాశ లేదు. విచారం లేదని పేర్కొన్నారు. ప్రధాని మోదీ, భారత్ ను నాశనం చేస్తానంటూ లేఖలో పేర్కొన్నారు.
1999లో ఐసీ–814 విమానాన్ని హైజాక్ చేశాక దానిని విడిచిపెట్టాలంటే అజార్ను వదిలేయాలని హైజాకర్లు డిమాండ్చేయడం, తప్పని పరిస్థితుల్లో అజార్ ను జైలు నుంచి వదిలిపెట్టిన విషయం తెలిసిందే. విడుదలైన నాటి నుంచి అజార్ పాకిస్తాన్ కేంద్రంగా ఉగ్రకార్యకలాపాలను ఉధృతం చేశాడు. సుభాన్ శిబిరం అలియాస్ ఉస్మానో అలీ క్యాంపస్ గా పిలుచుకునే ఈ ప్రాంగణాన్ని జైషే ఉగ్రసంస్థ ప్రధాన కార్యాలయంగా అజార్ వినియోగించుకుంటున్నాడు. 18 ఎకరాల ఈ ప్రాంతం నుంచే జైషే ఉగ్రసంస్థలోకి కొత్త వాళ్ల రిక్రూట్మెంట్లు, విద్వేష బోధన, శిక్షణ, నిధుల సేకరణ తదితర కార్యకలాపాలు కొనసా గుతుంటాయి. దీనితో 2019 మేలో అజార్ ను ఐక్య రాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో 2019 ఏప్రిల్ తర్వాత అజార్ పెద్దగా బహిరంగ కార్యక్రమాల్లో కనిపించలేదు. బహావల్పూర్ లోనే ఉంటున్నట్లు గతంలోనే నిఘా సమాచారం భారత్ కు అందింది. 2001లో భారత పార్లమెంట్పై దాడి, 2000లో జమ్మూకశ్మీర్ అసెంబ్లీపై దాడి, 2016లో పఠాన్కోట్ వైమానిక స్థావరంపై దాడి, 2019లో పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై ఆత్మాహుతి దాడులకు అజార్ సూత్రధారి అని తెలుస్తోంది.
ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ బుధవారం అర్ధరాత్రి చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ దాయాది పాకిస్థాన్కు భయం పుట్టిస్తోంది. ప్రధానంగా జైషే మహ్మద్, లష్కరే తోయిబా ప్రధాన స్థావరాలను లక్ష్యంగా చేసుకొని వాటిని కూల్చివేసింది. బవహల్పూర్ లోని జైష్-ఎ-మహమ్మద్, మురిద్కే కేంద్రంగా ఉన్న లష్కర్-ఎ-తొయిబా క్యాంపులపై ఇండియన్ ఎయిర్ఫోర్స్ జరిపిన దాడుల్లో దాదాపు 90 మంది ఉగ్రవాదులు హతమైనట్లుగా సమాచారం. ఇదులో జైషే ముఠాకు చెందిన ఓ స్థావరంపై జరిగిన దాడిలో 14 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది.