Minister Atchannaidu : గత వైసీపీ ప్రభుత్వంలో డీసీసీబీలను అవినీతి మయం చేసారు
తప్పు చేసిన వారు ఎవరైనా క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మంత్రి అచ్చెన్నాయుడు...
Minister Atchannaidu : గత జగన్ ప్రభుత్వంలోని ఐదేళ్లు డీసీసీబీలని అవినీతిలో కురుకుపోయేలా చేశారని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. గుంటూరు, విజయవాడ డీసీసీబీల్లో భారీగా అవినీతికి పాల్పడ్డారని షాకింగ్ కామెంట్స్ చేశారు. కూటమి ప్రభుత్వంలో డీసీసీబీల్లో అవినీతిపై హౌస్ కమిటీ నియమించి విచారణ చేయిస్తున్నామని చెప్పారు. నకిలీ పాస్ పుస్తకాలతో అక్రమంగా కోట్ల రుణాలు తీసుకున్నారని మండిపడ్డారు. వారందరిపై విచారణ చేయాలని ఆదేశాలు జారీ చేశామని అన్నారు. తప్పు చేసిన వారు ఎవరైనా క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మంత్రి అచ్చెన్నాయుడు.
Minister Atchannaidu Slsma YCP Govt
ఇవాళ(గురువారం) గుంటూరు జిల్లా సహకార బ్యాంకు పర్సన్ ఇన్చార్జిగా మక్కెన మల్లికార్జునరావు బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు(Minister Atchannaidu), ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు రైతులకు మేలు చేయాలని సహకార వ్యవస్థ తీసుకొచ్చారని గుర్తు చేశారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు సహకార వ్యవస్థలో జరుగుతున్న అక్రమాలపై చర్చించారని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వంలోని ఐదేళ్లు ఎన్నిక లేదు.. ఆడిట్ లేకపోవడంతో పెద్దఎత్తులో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. సహకార వ్యవస్థను గాడిలో పెట్టాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని తెలిపారు. బ్యాంక్ చైర్మన్ను నియమిస్తున్నామని.. త్వరలో సంఘాల సభ్యులను కూడా నియమిస్తామని ప్రకటించారు. గత జగన్ ప్రభుత్వంలో సభ్యత్వ నమోదులోనూ ఇష్టారాజ్యంగా వ్యవహరించారని ధ్వజమెత్తారు మంత్రి అచ్చెన్నాయుడు.
డిసీసీబీల్లో(DCCB) అక్రమాలకు చెక్ పెట్టేలా సంఘాలను కంప్యూటరీకరణ చేశామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఇప్పటికే 98 శాతం కంప్యూటరీకరణ పూర్తి చేశామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. జూన్కు సంబంధించిన ఆన్లైన్ లావాదేవీలపై విచారణ చేయాలని ఆదేశించామని చెప్పారు. రైతులకు ఖరీఫ్లో రుణాలు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. కౌలు రైతులకు నూరు శాతం రుణాలు ఇస్తామని మాటిచ్చారు. డీసీసీబీకి ఉన్న చెడ్డ పేరు తొలగిపోయేలా రైతులకు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. నల్లబర్లి పొగాకుపై సీఎం చంద్రబాబు సమీక్షించారని అన్నారు. గత ఏడాది కంటే మూడు రెట్లు అధికంగా దిగుమతి వచ్చిందని చెప్పారు. రైతులు నల్లబర్లి పొగాకుని భవిష్యత్తులో వేయొద్దని కంపెనీలు కోరుతున్నాయని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
Also Read : Rafale Fighter Aircraft : 2028 నాటికి హైదరాబాద్ లో రాఫెల్ విడిభాగాల తయారీ కేంద్రం