Minister Nara Lokesh: విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలి – మంత్రి లోకేశ్
విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలి - మంత్రి లోకేశ్
Nara Lokesh : విద్యావంతులు రాజకీయాల్లోకి వస్తేనే మార్పు సాధ్యమని… కాబట్టి బాగా చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలని ఏపీ మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. నాణ్యమైన విద్య, ఉపాధి కల్పించటమే తమ ప్రభుత్వ లక్ష్యమని… కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తరువాత విద్యావ్యవస్థలో గొప్ప సంస్కరణలను తీసుకువచ్చిందన్నారు. బాపట్ల జిల్లా ఇంకొల్లులో మంత్రి లోకేశ్ పర్యటించారు. ఇంకొల్లులోని గంగవరం రహదారిలోని మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు నిర్మించిన డీవీఆర్ సైనిక్ స్కూల్ ను మంత్రి లోకేశ్ (Nara Lokesh) ప్రారంభించారు. ఈ సందర్భంగా విలువలతో కూడిన విద్యను అందించడం కోసమే ఈ సైనిక్ స్కూల్ ప్రారంభించినట్లు ఎంపీ పురందేశ్వరి తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యేలు సాంబశివరావు, ఎంఎం కొండయ్య యాదవ్, నరేంద్ర వర్మ తదితరులు పాల్గొన్నారు.
Minister Nara Lokesh Invites
అనంతరం మంత్రి లోకేశ్ (Nara Lokesh) మాట్లాడుతూ… గ్రామీణ ప్రాంతంలో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. చిన్ననాటి నుంచే విద్యార్థులు దేశభక్తిని అలవరుచుకోవాలని సూచించారు. ఏపీకి పెద్ద ఎత్తున సీఎం చంద్రబాబు పెట్టుబడులు తీసుకువస్తున్నారు. రాబోయే కాలంలో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగావశాలు కల్పిస్తాం. అన్ని రంగాల్లో ఏపీ మొదటి స్థానంలో ఉంచేందుకు సీఎం చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు.
గురువులు దేవుడితో సమానమని… అందరిని గౌరవించాల్సిన బాధ్యత మనందరిపై ఉంటుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. తల్లులను గౌరవించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. పహల్గాంలో అన్యాయంగా భారత పర్యాటకులను పాకిస్థాన్ ఉగ్రవాదులు చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్థాన్ టెర్రరిస్టులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సరైన గుణపాఠం చెప్పారని అన్నారు మంత్రి నారా లోకేష్.
సైనికులను జాగ్రత్తగా చూసుకుని వారిని గౌరవించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. మనకు పరీక్షలు పెట్టే దేవుడే… వాటిని జయించే శక్తిని కూడా ఇస్తారని చెప్పుకొచ్చారు. తెలుగుదేశం 20 సంవత్సరాల పాటు మంగళగిరిలో గెలవలేదని అన్నారు. తాను కూడా మంగళగిరిలో మొదటిసారి పోటీ చేసి ఓడిపోయానని… ఆ తర్వాత ఐదేళ్లు కష్టపడి అత్యధిక మెజార్టీతో గెలిచానని గుర్తుచేశారు. తాను ఓడిపోయినప్పుడు ఎందరో హేళన చేశారని… కానీ తాను బాధపడలేదు… గెలిచి చూపించానని ఉద్ఘాటించారు. ఎవరూ నిరుత్సాహపడొద్దు.. విజయం సాధించి చూపించాలని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
Also Read : New Bride: పెళ్ళైన నెలకే భర్తను హత్య చేయించిన భార్య
