Minister Nara Lokesh: అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై మంత్రి లోకేష్ సమీక్షా సమావేశం
అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై మంత్రి లోకేష్ సమీక్షా సమావేశం
Nara Lokesh : ఈ నెల (జూన్) 21న విశాఖ వేదికగా జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై బీచ్ రోడ్లోని ఏయూ కన్వెన్షన్ హాలు సమీపంలోని సాగరిక హాలులో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటి, మరియు ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్(Nara Lokesh) అధ్యక్షతన నిర్వహించిన ఈ సమీక్షా సమావేశంలో కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, జిల్లా ఇన్ చార్చి మంత్రి డోలా బాలవీరాంజనేయుస్వామి, రాష్ట్రమంత్రులు వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసద్, గుమ్మడి సంధ్యారాణి, కలెక్టర్ హరీంద్రప్రసాద్, రాష్ట్ర, జిల్లాస్థాయి అధికారులు, మరియు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Minister Nara Lokesh Key Comments on Yoga Celebrations
ఈ సందర్భంగా మంత్రి లోకేష్(Nara Lokesh) మాట్లాడుతూ… విశాఖపట్నంలో(Vizag) అంతర్జాతీయ యోగా దినోత్సవం(National Yoga Day) సందర్భంగా నిర్వహించే యోగాంధ్ర కార్యక్రమం అత్యంత కీలకమైంది, ఆరోజున మనం సాధించబోయే రికార్డు కోసం ప్రపంచమంతా విశాఖ మహానగరం వైపు చూస్తోందన్నారు. ప్రధాని మోడీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని మంత్రి నారా లోకేష్ అధికారులకు విజ్ఞప్తిచేశారు. ఒకే ప్రాంతంలో 5లక్షలమందితో నిర్వహించే ఈ ఈవెంట్ ప్రపంచంలోనే అతిపెద్దదిగా చరిత్ర సృష్టించబోతోంది. ప్రధాని మోడీహాజరు కాబోతున్నారు, అధికారులంతా పట్టుదల, క్రమశిక్షణ, కమిట్ మెంట్ తో పకడ్బందీగా కార్యక్రమాన్ని నిర్వహించాలి. ఇది రాష్ట్రప్రజలందరి కార్యక్రమం, రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయపక్షాలు భాగస్వాములు కావాలి. యోగావల్ల ప్రజల మానసిక, శారీరక ఆరోగ్యం బాగుంటుందని ప్రధాని చెబుతున్నారు. దీనిపై ప్రసార మాధ్యమాల్లో విస్తృత ప్రచారం కల్పించాలి.
ఈనెల 21న ఆర్ కె బీచ్ నుంచి భీమిలి(Bheemili) వరకు 26 కి.మీ.ల పొడవున 247 కంపార్ట్ మెంట్లలో నిర్వహించే ఈ కార్యక్రమానికి వచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలి. ఆరోజు ఉదయం 6.30గంటలకు ప్రధాని ఆర్ కె బీచ్ ఖాళీమాత ఆలయం వద్ద ప్రధాన ప్రాంగణానికి చేరుకుంటారు. అంతకు గంటముందే ప్రజలంతా ఆయా కంపార్ట్ మెంట్లకు చేరేలా రవాణా సౌకర్యం కల్పించండి. సుదూర ప్రాంతాల్లో నిలిపివేసి ఇబ్బందులకు గురికాకుండా తగిన ఏర్పాట్లు చేయాలి. 600 మీటర్లకు మించి ప్రజలను నడిపించకుండా వాహనాలను వదలాలి. ప్రజలను ఇళ్లవద్ద నుంచి ప్రాంగణానికి చేరేదగ్గర నుంచి తిరిగి వారు ఇంటికి చేరేవరకు బాధ్యత తీసుకోవాలి. 19,20,21 తేదీలు కీలకం, అధికారులంతా ప్రణాళికాబద్ధంగా, కలసికట్టుగా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మంత్రి నారా లోకేష్(Nara Lokesh) అధికార యంత్రాంగాన్ని కోరారు. ఈ సమీక్షా సమావేశానికి ముందు ఎయు గ్రౌండ్స్ లో నిర్వసిస్తున్న యోగా శిక్షణను మంత్రి లోకేష్ తిలకించారు.
కంపార్ట్ మెంట్ కు ఒక గెజిటెడ్ అధికారి – నోడల్ ఆఫీసర్ ఎంటీ కృష్ణబాబు
విశాఖలో నిర్వహించే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి రాష్ట్రస్థాయి నోడల్ ఆఫీసర్ గా నియమితులైన ఎంటి కృష్ణబాబు మాట్లాడుతూ… యోగాడే నిర్వహించే 247 కంపార్ట్ మెంట్లలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రతి కంపార్ట్ మెంట్ కు ఒక గెజిటెడ్ అధికారికి బాధ్యతలు అప్పగించాం, కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలంతా ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. క్వూఆర్ కోడ్ ద్వారా వారిని నిర్ణీత కంపార్ట్ మెంట్లలోకి అనుమతిస్తాం. సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారిని రాత్రి 2గంటలనుంచే అనుమతించేలా చర్యలు చేపట్టాం. జనాన్ని తీసుకొచ్చే వాహనాలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్రమబద్దీకరించేందుకు వీలుగా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేసి, 1200 కెమెరాలను అమర్చాం.
ఆర్ కె బీచ్ నుంచి భీమిలివరకు 30 ప్రధాన లోకేషన్లతోపాటు మరో 18అదనపు లోకేషన్లలో కూడా ఏర్పాట్లు చేశాం. కార్యక్రమ నిర్వహణ కోసం 2వేలమంది యోగా ఇన్ స్ట్రక్టర్లకు బాధ్యతలు అప్పగించాం. వారందరినీ ముందురోజు రాత్రే ఎయు గ్రౌండ్స్ కి రప్పిస్తాం. ముందుజాగ్రత్త చర్యగా 116 అంబులెన్స్ లను సిద్ధం చేశాం. హాజరయ్యే వారందరికీ మ్యాట్స్, టీషర్ట్స్ ఆయా కంపార్ట్ మెంట్ల వద్దే అందించేలా ఏర్పాట్లు చేశాం. 1400మంది బయో టాయ్ లెట్లను అందుబాటులో ఉంచుతాం. విశాఖతోపాటు పరిసర జిల్లాల నుంచి వచ్చే ప్రజల కోసం 3,500 ఆర్టీసి బస్సులు, 8వేల ప్రైవేటు, స్కూలు బస్సులను సిద్ధంచేశాం. ప్రజలను సురక్షితంగా రప్పించే తిరిగే తీసుకెళ్లేలా సెక్రటేరియట్ ఉద్యోగులకు బాధ్యతలు అప్పగించామని కృష్ణబాబు తెలిపారు.
యోగా దినోత్సవం ప్రచారంపై రెండు సంస్థలతో ప్రభుత్వం ఎంఓయూ
ఈ నెల 21న విశాఖపట్టణం వేదికగా జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల నిర్వహణలో భాగంగా విస్తృత అవగాహన, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఆధారంగా యోగా శిక్షణలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో రెండు సాంకేతిక సంస్థలు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ మేరకు ఏయూ కన్వెన్షన్ హాలు సమీపంలోని సాగరిక హాలులో మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశం అనంతరం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, ఇతర మంత్రులు డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి తదితరుల సమక్షంలో సంబంధిత సంస్థలకు చెందిన అధికారులు, ఆయూష్ విభాగం రాష్ట్ర స్థాయి అధికారులు ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న సంస్థల్లో కర్నూలులోని ట్రిపిల్ ఐటీ డీఎం (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజైన్, మాన్యుఫాక్చరింగ్) సాంకేతిక విద్యా సంస్థ, మహారాష్ట్రకు చెందిన సాంకేతిక సంస్థ హాబిల్డు హెల్త్ టెక్ ప్రయివేటు లిమిటెడ్ సంస్థలు ఉన్నాయి. మంత్రుల సమక్షంలో ఐఐఐటీ డీఎం-కర్నూలుకు చెందిన ఆచార్యులు కృష్ణనాయక్, ఎం. నరేశ్ బాబు, హాబిల్డ్ సాంకేతిక సంస్థ ప్రతినిధి అన్సుల్ అగర్వాల్, ఆంధ్రప్రదేశ్ ఆయూష్ విభాగం డైరెక్టర్ దినేశ్ కుమార్ పాల్గొని ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. అనంతరం ఎంవోయూలు కుదుర్చుకున్న పత్రాలను మార్చుకున్నారు.
అలాగే ఐఐఐటీ డీఎం-కర్నూలు సంస్థ కృత్రిమ మేధ ఆధారంగా రూపొందించిన యాప్ సాయంతో యోగా శిక్షణ ఇచ్చేందుకు రూపొందించినది కాగా… మరొకటి ప్రత్యేక కోర్సు రూపంలో 21 రోజుల పాటు ఆన్లైన్ లింకు సాయంతో ఉచిత యోగా శిక్షణ అందించేందుకు రూపొందించిన సాంకేతిక సాధనం.
Also Read : Nara Lokesh: జాతీయ మహిళా కమిషన్ పై నారా లోకేష్ ప్రశంసల వర్షం