Minister Nirmala Sitharaman: ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ‘భారత లక్ష్మి’ అవార్డు
ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ‘భారత లక్ష్మి’ అవార్డు
Nirmala Sitharaman : కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కు అరుదైన గౌరవం దక్కింది. చారిత్రక ఉడుపి శ్రీకృష్ణ మఠం… ఆమెకు ‘భారత లక్ష్మి’ అవార్డును ప్రకటించింది. దేశ ఆర్ధిక వ్యవస్థను నడిపించడంలో కీలకంగా వ్యవహరించడంలో ఆమె సేవలను గుర్తించి ఈ అవార్డును ప్రకటించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఉడుపి శ్రీకృష్ణ మఠంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు ‘భారత లక్ష్మి’ పురస్కారాన్ని ప్రదానం చేశారు.
Union Finance Minister Nirmala Sitharaman
ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తితో కలిసి శ్రీకృష్ణ మఠంలో వివిధ కార్యక్రమాల్లో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. మఠంలోని చంద్రశాలలో కూర్చుని సుధామూర్తి దేవుని సేవకు పూలు కట్టారు. నిర్మలా సీతారామన్ సాధారణ భక్తురాలిగా నైవేద్యపు పాత్రలను శుభ్రం చేశారు. అన్నబ్రహ్మ సన్నిధిలో వంట తయారీలోనూ పాల్గొన్నారు. మహా కవ్వాన్ని ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో పర్యాయ పుత్తిగె మఠాధిపతి సుగుణేంద్ర తీర్థ స్వామి ఆమెకు ‘భారత లక్ష్మి’ పురస్కారాన్ని ప్రకటించగా… అదమారు మఠాధిపతి విశ్వప్రియ తీర్థ స్వామి ఆ పురస్కారాన్ని ఆలయంలో ప్రదానం చేశారు. శ్రీకృష్ణుని సందేశాలను విశ్వవ్యాప్తం చేయడంలో పుత్తిగె మఠం ప్రధాన పాత్ర పోషిస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి కొనియాడారు.
