Minister Ponguleti Srinivas Reddy: ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Ponguleti Srinivas Reddy : రాష్ట్రంలో 22వేల కోట్ల రూపాయలతో 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. పేదోడి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని… అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని ఆయన స్పష్టం చేసారు. పైలట్ గ్రామాల్లో ఇళ్ల నిర్మాణం చురుగ్గా జరుగుతోందని అన్నారు. మిగిలిన గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక కొద్ది రోజుల్లోనే పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) వెల్లడించారు.
Minister Ponguleti Srinivas Reddy
నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ లో శిక్షణ పొందిన అసిస్టెంట్ ఇంజనీర్లకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) శనివారం సర్టిఫికెట్లు అందజేశారు. హౌసింగ్ కార్పొరేషన్ లో 350 మంది ఔట్ సోర్సింగ్ అసిస్టెంట్ ఇంజనీర్లను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. హౌసింగ్ అసిస్టెంట్ ఇంజనీర్లకు ఆరు రోజులపాటు అధికారులు శిక్షణ ఇచ్చారు. శిక్షణ పూర్తి చేసుకున్న అసిస్టెంట్ ఇంజనీర్లకు సర్టిఫికెట్లు అందజేశారు. అలాగే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో 21 మందికి ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. గ్రేడ్ -2లో పనిచేస్తున్న10 మంది సబ్ రిజిస్ట్రార్లను గ్రేడ్-1కి, సీనియర్ సహాయకులుగా పనిచేస్తున్న 11 మందికి గ్రేడ్-2 పదోన్నతులు కల్పించింది. పదోన్నతులు పొందిన ఉద్యోగులకు సర్టిఫికెట్లను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ… గృహ నిర్మాణ శాఖకు మంచి పేరు తేవాలని ఇంజినీర్లను కోరారు. ఎక్కడ తప్పు జరగకుండా చూసే బాధ్యత ఇంజినీర్లదే అన్నారు. ‘‘తప్పు జరిగిందని చెబితే చాలు… బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తాం… దానికి ఫోన్ చేసి వివరాలు చెప్పవచ్చు. నిజమైన పేదలకే ఇళ్లు కేటాయించాలి… దీనిలో మరో మాట లేదు. ఇళ్ల నిర్మాణంలో ఆధునిక సాంకేతికత వాడుతున్నాం. ఫేజ్-1 నుంచి ఫేజ్-4 వరకు జాగ్రత్తగా సిఫారసు చేయాలి. అర్హులను ఎంపిక చేసేటప్పుడు అన్ని విషయాలూ పరిశీలించాలి. ఇళ్ల నిర్మాణంలో చిన్న ఫిర్యాదు వచ్చినా ఊరుకునేది లేదు’’ అని పొంగులేటి తెలిపారు.
Also Read : Santhara: మధ్యప్రదేశ్ లో మూడేళ్ళ చిన్నారికి సంతారా (కారుణ్య మరణం)
