Minister Seethakka : మహిళా శిశు సంక్షేమంపై మంత్రి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు
మహిళా శిశు సంక్షేమం కోసం నిపుణులతో ఒక అడ్వైజరీ కమిటీ నియమిస్తామని చెప్పారు...
Minister Seethakka : మహిళా శిశు సంక్షేమం కోసం ఎన్నో కొత్త ఆలోచనలకు మేధో మథన సదస్సు ప్రాణం పోసిందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క(Minister Seethakka) అన్నారు. రెండు రోజుల పాటు జరిగిన మేధో మధన సదస్సు ముగింపు సభలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. మేధో మధన సదస్సు విజయవంతం అయ్యిందని.. ప్రతీ మూడు నెలలకు ఒకసారి ఇలాంటి సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. జిల్లాల్లో ఇలాంటి సదస్సులు నిర్వహించడం ద్వారా అనుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చన్నారు. ఈ సదస్సులో మహిళా శిశు సంక్షేమంపై పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలు, మేధావులు తమ విలువైన సలహాలు ఇచ్చారని అన్నారు.
Minister Seethakka Comments
మహిళా శిశు సంక్షేమం(Women and Child Welfare) కోసం నిపుణులతో ఒక అడ్వైజరీ కమిటీ నియమిస్తామని చెప్పారు. వారి సలహాలు సూచనలతో శాఖ ద్వారా అందుతున్న సేవలను మరింత పటిష్టపరుస్తామని వెల్లడించారు. బాలికల రక్షణ కోసం బాలికలతో స్నేహ కమిటీలను ఏర్పాటు చేస్తామనన్నారు. స్వీయ రక్షణ టీంలుగా స్నేహ కమిటీలు పనిచేస్తాయని చెప్పుకొచ్చారు. అంగన్వాడీ టీచర్ల ద్వారా అమ్మాయిలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అవగాహన కల్పిస్తామన్నారు. మహిళ, బాలికల భద్రత మీద పనిచేసే స్వచ్చంద సంస్థలను గుర్తించి అంగన్వాడీలను వారితో అనుసంధానం చేస్తామని అన్నారు. త్వరలో మహిళల హక్కుల మీద పనిచేసే స్వచ్ఛంద సంస్థలతో సమావేశం నిర్వహించి మహిళ భద్రత కోసం పటిష్ట విధానాలను రూపొందిస్తామని మంత్రి తెలిపారు.
చాలా చోట్ల ముళ్ళ పొదల్లో, చెత్తకుప్పల్లో అప్పుడే పుట్టిన బిడ్డలను వదిలేసి వెళుతున్నారని.. చీమలు, కుక్కలు, చెత్త, ముండ్ల మధ్య శిశువుల(Women and Child Welfare) ప్రాణాలు పోతున్నాయన్నారు. దీన్ని నివారించేందుకు వీలున్న చోట ఊయలలను ఏర్పాటు చేస్తామన్నారు. బిడ్డలను పారేయకుండా.. ఆ ఊయలలో వదిలేస్తే వారి బాధ్యతను తామే స్వీకరిస్తామని అన్నారు. తెలంగాణ ఏర్పాటై 10 సంవత్సరాలైనా ఇప్పటికీ బాల్య వివాహ నిరోధక చట్ట రూల్స్ను అడాప్ట్ చేసుకోకపోవడం బాధాకరమన్నారు. త్వరలో రూల్స్ను అడాప్ట్ చేసుకుంటామని ప్రకటించారు.
బాల్య వివాహాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. గ్రామ సభల్లో, ఇతర ప్రభుత్వ కార్యక్రమాల్లో బాల్య వివాహల వల్ల జరిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని మంత్రి తెలిపారు. ఐసీడీఎస్ పథకాలకు తెలంగాణ ప్రాంతంలోనే బీజం పడిందన్నారు. 1972లో మహబూబ్నగర్లో ఫ్రీడమ్ ఫైటర్ దుర్గాబాయి దేశ్ముఖ్ ఐసీడీఎస్ ప్రారంభించారన్నారు. ఆ అనుభవాల ఆధారంగానే దేశవ్యాప్తంగా ఇందిరా గాంధీ ఐసీడీఎస్ స్కీంను విస్తరింపజేశారని తెలిపారు. అంగన్వాడీ సేవలకు ఆరాధ్యులుగా దుర్గాబాయి దేశ్ముఖ్, ఇందిరా గాంధీ నిలిచారని చెప్పుకొచ్చారు. వారి ఆదర్శంగా అంగన్వాడీ సేవలను ప్రతి ఇంటికి చేర్చాలన్నారు.
ఈ ఏడాది వేయి అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలను నిర్మించి ఇస్తామని వెల్లడించారు. జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసి స్థలాలను గుర్తించాలని ఆదేశించారు. అంగన్వాడీ గదుల్లోనే దేశ భవిష్యత్తు ఉందని.. కాబట్టి దేశ భవిష్యత్తును లిఖించేది అంగన్వాడీ సిబ్బంది అని తెలిపారు. కరీంనగర్లో ప్రతీ శుక్రవారం అంగన్వాడీ సిబ్బంది గ్రామస్తులతో సమావేశాలు నిర్వహిస్తున్నారన్నారు. అదే విధంగా అన్ని జిల్లాల్లో అమలు చేయాలని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల అడ్మిషన్లను , హాజరును పెంచాలని మంత్రి ఆదేశించారు.
ఆకాశాన్ని చీల్చుకొని అమ్మాయిలు అంతరిక్షానికి వెళ్లినా భూమి మీద కొన్నిసార్లు రక్షణ కరువవుతుందన్నారు. అందుకే అమ్మాయిల స్వీయ రక్షణ కోసం బాలికా రక్షక టీంలను ఏర్పాటు చేస్తామన్నారు. అమ్మాయిలను వేధిస్తే సంఘ బహిష్కరణకు గురవుతారని హెచ్చరించారు. అమ్మాయిలను ముట్టుకుంటే కఠిన శిక్షలు తప్పవన్నారు. అమ్మాయిల పట్ల చెడుగా ప్రవర్తిస్తే ఇలాంటి శిక్షలు అనుభవించాల్సి వస్తుందో అబ్బాయిలకు అవగాహన కల్పించాలని మంత్రి సీతక్క(Minister Seethakka) వెల్లడించారు.
Also Read : Trump-US : అమెరికాలో రికార్డు స్థాయిలో కొనసాగుతున్న అక్రమ వలసదారుల ఏరివేత