Minister Vangalapudi Anitha: జగన్‌ కు రాజకీయ లబ్ధి తప్ప మనుషుల ప్రాణాలంటే లెక్క లేదు – అనిత

జగన్‌ కు రాజకీయ లబ్ధి తప్ప మనుషుల ప్రాణాలంటే లెక్క లేదు - అనిత

Vangalapudi Anitha :  వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీని చూస్తుంటే రాజకీయాలు దిగజారిపోయాయన్న ఆవేదన కలుగుతోందని అన్నారు. వైసీపీ అధినేత జగన్‌ కు మానవత్వం లేదు… హింసను ప్రేరేపిస్తున్నారని ఆమె మండిపడ్డారు. సోమవారం కేబినెట్ సబ్ కమిటీ భేటీ అనంతరం ఏపీ సచివాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్‌ కు సత్తెనపల్లి పర్యటన సందర్భంగా జడ్‌ప్లస్‌ సెక్యూరిటీ కల్పించామని ఆమె స్పష్టం చేశారు. పరామర్శకు వెళ్తూ జగన్‌ రోడ్‌షో చేశారని ధ్వజమెత్తారు. ఉదయం పదిన్నరకు తాడేపల్లి నుంచి బయల్దేరిన జగన్‌… సాయంత్రం 4 గంటలకు రెంటపాళ్ల చేరుకున్నారని తెలిపారు. జగన్‌ (YS Jagan) కావాలనే బలప్రదర్శన చేసుకుంటూ వెళ్లారని చెప్పుకొచ్చారు. జగన్‌ వాహనం కింద ఓ వ్యక్తి పడిన ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. దయ, జాలి లేకుండా అతడ్ని ముళ్ల పొదల్లో పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు హోంమంత్రి అనిత.

Vangalapudi Anitha – జగన్‌ రాజకీయ ముసుగులో ఉన్న నేరస్తుడు

సింగయ్యను సమయానికి ఆస్పత్రికి తరలిస్తే బతికేవారని హోంమంత్రి అనిత (Vangalapudi Anitha) అన్నారు. దళితుడు జగన్‌ కారు టైర్‌ కింద నలిగిపోయినా పట్టించుకోలేదని మండిపడ్డారు. జగన్‌ కు రాజకీయ లబ్ధి తప్పించి మనుషుల ప్రాణాలంటే లెక్క లేదా అని ప్రశ్నించారు. జగన్‌ పర్యటనలో ఇద్దరు చనిపోయినా పర్యటన కొనసాగించారని ఫైర్ అయ్యారు. బెట్టింగ్‌ లో అప్పులపాలై చనిపోయిన వ్యక్తికి విగ్రహం పెట్టించారని చెప్పుకొచ్చారు. తన పర్యటనలో ఇద్దరు చనిపోయినా జగన్ రెడ్డి ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. జగన్‌ కు ఇంకా సీఎం కుర్చీలో కూర్చోవాలనే దురాశ ఉందని చెప్పారు. జగన్‌ (YS Jagan) వాహనం కిందపడే సింగయ్య నలిగిపోయినట్లు వీడియో ఉందని అన్నారు. సింగయ్య (Singayya) మృతిని వైసీపీ నేతలు నిస్సిగ్గుగా సమర్థిస్తున్నారని… చనిపోయింది తమ పార్టీ కార్యకర్తేగా అని కొంతమంది నేతలు అంటున్నారని తెలిపారు. జగన్‌ రాజకీయ ముసుగులో ఉన్న నేరస్థుడని ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చిన బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనంలో జగన్‌ ఎందుకు వెళ్లట్లేదని ప్రశ్నించారు. జగన్‌ కావాలనే విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు.

‘నాయకులు అనే వారు ఎంతో బాధ్యతగా ఉండాలి. పరిస్థితులు జగన్ వచ్చాక ఇంతగా దిగజారిపోయాయా అనిపిస్తోంది. హింసను చేస్తూ దాన్ని జగన్ సమర్ధించుకుంటున్నారు. పొదిలిలో వైసీపీ అరాచకం చూశాం… ఆ వెంటనే రెంటపల్లె వెళ్తాం అన్నారు. వెంటనే మేము నోటీస్ ఇచ్చాం. ఇంతమందితోనే వెళ్లాలని చెప్పాం. పరామర్శకు వెళ్లే వ్యక్తి రోడ్ షో చేశారు. జగన్ నిర్లక్ష్యం కారణంగా సింగయ్య, రెడ్డి అనే వాళ్లు చనిపోయారు. అప్పటికీ కూడా ఇంకా సమర్ధించుకోవడం దారుణం. ఆ వీడియో మార్ఫింగ్ అని కూడా ఫ్యాన్ పార్టీ నేతలు అంటున్నారు. ఇంత దారుణమా. మంత్రి నారా లోకేష్ పరామర్శకు వెళ్తే ఫొటో కూడా ఇవ్వరు… అది ఆయన రాజకీయ పరిణతి. మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్‌ కి బాధ్యత లేదా.

వైసీపీ కార్యకర్త పేరుతో ఒక చేత్తో గొడ్డలి… మరో చేత్తో వైసీపీ జెండా పట్టుకుంటారు. కార్యకర్త ప్రదర్శించిన ప్లకార్డులు సినిమా డైలాగ్‌లు తప్పేముందని జగన్ సమర్ధిస్తారా. సినిమాలో చెప్పిన డైలాగ్‌లు బయట నిజం చేస్తాం అంటే ఎలా. పరామర్శకు వెళ్లే వ్యక్తికి 7గంటల పాటు రోడ్ షో అవసరమా ? పరామర్శను బలప్రదర్శనగా మార్చుకుంటారా ? జగన్, అతని మనుషులు రాజకీయాలను దిగజారుస్తున్నారు. మానవత్వం లేకుండా హింసను ప్రేరేపిస్తున్న రాజకీయ నాయకులను ఏమనాలో కూడా అర్ధం కావట్లేదు. సమాజంలో జగన్ లాంటి మనుషులు ఉండటం అవసరమా అని ప్రతీ ఒక్కరూ ఆలోచన చేయాలి’ అని హోంమంత్రి అనిత కోరారు.

జగన్ తన విలువను ఇంకా దిగజార్చుకుంటున్నాడు

‘జగన్ నంగనాచిలా ఇంట్లో కూర్చుని అసత్య ట్వీట్‌లు పెడితే ప్రజలు నమ్మేస్తారనుకుంటున్నాడా.? కార్యకర్తలు ఉన్మాదుల్లా తన వద్దకు రావాలని జగన్ కోరుకుంటున్నాడు. అందుకనుగుణంగా పోలీసు భద్రతను సైతం లెక్కచేయట్లేదు. సింగయ్య మృతితో నాకేంటి సంబంధం అంటూ జగన్ తన విలువను ఇంకా దిగజార్చుకుంటున్నాడు. ప్రాథమిక సమాచారం ఆధారంగానే ఆ రోజు ఎస్పీ వేరే వాహనం ఢీ కొట్టిందని చెప్పారు. ఆధారాలు దొరికాక అదే ఎస్పీ కేసును ముందుకు తీసుకెళ్లారు. చంద్రబాబు పర్యటనలకు గతంలో ఆంక్షలు పెట్టామా అంటున్న జగన్ … ఇంటి గేటుకు తాళ్లు కట్టింది మరిచారా? చంద్రబాబుని విమానాశ్రయంలో అడ్డుకోలేదా. లోకేష్ యువగళం పాదయాత్రలో మైకు, స్టూలు కూడా లాక్కుని పారిపోలేదా? జడ్ ప్లస్ భద్రతలో భాగంగా జగన్‌కు (YS Jagan) ఎలాంటి భద్రత కల్పించాలో కల్పిస్తున్నాం. కందుకూరులో తొక్కిసలాట జరిగి తెలుగుదేశం కార్యకర్తలు చనిపోతే చంద్రబాబు వెంటనే మీటింగ్ రద్దు చేశారు. ఆస్పత్రికి వెళ్లి వెంటనే క్షతగాత్రులను పరామర్శించారు. మరుసటి రోజే బాధిత కుటుంబాల ఇంటికి వెళ్లి పరామర్శించారు’ అని హోంమంత్రి అనిత వెల్లడించారు.

Also Read : YS Sharmila: సింగయ్య మృతికి ముమ్మాటికీ జగన్ నిర్లక్ష్యమే కారణం – షర్మిల

Leave A Reply

Your Email Id will not be published!