MJ Akbar: పాకిస్తాన్ పై నిప్పులు చెరిగిన ఎంజే అక్బర్
పాకిస్తాన్ పై నిప్పులు చెరిగిన ఎంజే అక్బర్
MJ Akbar : పహాల్గాం ఉగ్రదాడితో రెండు నాల్కల ధోరణి ప్రదర్శిస్తోన్న దాయాది దేశం పాకిస్తాన్ పై విదేశాంగశాఖ మాజీ సహాయ మంత్రి ఎంజే అక్బర్(MJ Akbar) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పాక్ ను సర్పంతో పోల్చిన ఆయన… అబద్ధాలతో కాలం గడిపే, కపటనీతి కలిగిన దేశంతో చర్చలు జరపడం కష్టమేనన్నారు. దాయాది దేశంతో చర్చలు జరపవచ్చుకదా? అంటూ కొందరు చేస్తున్న వాదనకు బదులిస్తూ… దానికి వెనక లాజిక్ ఏంటని ప్రశ్నించారు. బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలో విదేశాల్లో పర్యటిస్తున్న విపక్ష బృందంలో ఉన్న అక్బర్(MJ Akbar)… కోపెన్హాగన్లో ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ పాక్పై నిప్పులు చెరిగారు.
‘‘పాకిస్థాన్(Pakistan)తో భారత్ ఎందుకు చర్చలు జరపదని కొందరు మిత్రులు అడుగుతున్నారు. అక్కడ చిత్తశుద్ధిలేని ప్రభుత్వం ఉంది. ఎవరితో చర్చలు జరపాలి? అక్కడ వాగ్దానాలను ఉల్లంఘించే ప్రభుత్వం ఉంది. ఎవరితో మాట్లాడాలి? విషపు నాలుక కలిగిన ప్రభుత్వం అది… దానివల్ల ఎవరికి నష్టం?’’ అని అక్బర్(MJ Akbar) ప్రశ్నించారు. సర్పం ఎన్నడూ తన విషంతో చనిపోదన్న విషయాన్ని గుర్తుచేశారు.
దేశంలో దీర్ఘకాలంగా అశాంతికి పాకిస్థాన్ ప్రధాన కారణమని మాజీ మంత్రి పేర్కొన్నారు. ఓ సాకుగా మారిన విషయాలపై చర్చల కోసం భారత్ తన సమయాన్ని వృథా చేసుకోదని స్పష్టం చేశారు. చర్చల కాలాన్ని దాయాది దేశం మరో ఉగ్రదాడికి ఉపయోగించుకుంటుందని మండిపడ్డారు. పాక్ నోట చర్చలు అనేవి బూటకపు మాటలు తప్ప మరేమీ లేదన్నారు. అవసరమైన విషయాలపై చర్చలు జరుపుతామని, అవి కూడా పీవోకేని తిరిగి తీసుకునే విషయంపైనేనని స్పష్టం చేశారు.
MJ Akbar – ఆ ఫొటో చూసి చలించిపోయా – అనుపమ్ ఖేర్
పహల్గాం ఘటనపై బాలీవుడ్ నటుడు అనుపమ్ఖేర్ స్పందించారు. నాడు భర్త మృతదేహం వద్ద రోదిస్తున్న నవ వధువును చూసి తాను చలించిపోయానంటూ ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
‘‘పహల్గాంలో ఉగ్రవాదులు మారణహోమం జరిపారు. భారత్ పై ఎన్నో ఉగ్రదాడులకు పాల్పడ్డారు. కశ్మీర్ లో 1990 జనవరి 19న కశ్మీరీ పండితులు తమ ఇళ్లను వదిలేసి వెళ్లిపోవాల్సి పరిస్థితి వచ్చింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత మళ్లీ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం బాధాకరం. ఇటీవల కాలంలో ఎంతో మంది కశ్మీర్కు వెళ్లడం ప్రారంభించారు. పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దాడి ఎంతో బాధాకరం. తన భర్త మృతదేహం వద్ద రోదిస్తున్న నవ వధువు పరిస్థితి చూసి చలించిపోయా. ఈ ఘటనపై జాతి మొత్తం ఆగ్రహం వ్యక్తంచేసింది’’ అని అనుపమ్ ఖేర్ వెల్లడించారు. ‘‘పాకిస్థాన్పై ప్రతీకార చర్యకు దిగడం సరైన నిర్ణయం. ఆ దేశంలోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసింది. మన సాయుధ దళాలు సత్తా చాటాయి. మన దేశ సైన్యం, నిఘా సంస్థలు అద్భుతంగా పని చేశాయి’’ అని కొనియాడారు.
కాగా… పహల్గాంలోని బైసరన్ లోయలో ఏప్రిల్ 22న పర్యాటకులపై ఉగ్రవాదులు పాశవిక దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి తాము బాధ్యులమని పాక్ కేంద్రంగా ఉన్న లష్కరే తోయిబాకు చెందిన ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’’ బాధ్యత ప్రకటించుకుంది. దీన్ని భారత ప్రభుత్వం గతంలోనే ఉగ్ర సంస్థగా ప్రకటించింది. ఈ మారణహోమానికి ప్రతీకారంగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ ను చేపట్టింది. పాక్లోని కీలక ఉగ్రవాద, సైనిక స్థావరాలే లక్ష్యంగా బ్రహ్మోస్ క్షిపణులతో మెరుపు దాడులు చేసింది. భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా ఈ దాడిని నిర్వహించాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్తో పాటు పాకిస్థాన్లోని ఉగ్ర మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశాయి.
Also Read : Operation Sindoor : ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్ 600 డ్రోన్లతో తెగబడింది-బీఎస్ఎఫ్ ఐజీ