MLC Kavitha: హరీశ్ రావుపై కవిత సంచలన వ్యాఖ్యలు
హరీశ్ రావుపై కవిత సంచలన వ్యాఖ్యలు
MLC Kavitha : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పక్కనున్న కొందరు చేసిన పని వల్లే ఆయనకు చెడ్డపేరు వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. అందులో ఐదేళ్లపాటు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న హరీశ్రావు పాత్ర లేదా ? అని ప్రశ్నించారు. మాజీ ఎంపీ సంతోష్, హరీశ్ రావు వల్లే కేసీఆర్కు చెడ్డపేరు వచ్చిందన్నారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడారు. కాళేశ్వరంలో చిన్నభాగం కుంగితే మొత్తం ప్రాజెక్టు పోయినట్లు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు.
MLC Kavitha Slams Harish Rao
‘‘కేసీఆర్ జనం కోసం పని చేస్తే… వాళ్లు ఆస్తుల పెంపుకోసం పని చేశారు. హరీశ్రావు, సంతోష్ నాపై ఎన్నో సార్లు కుట్రలు చేశారు. అయినా నేను నోరు మెదపలేదు. ఈ రోజు కేసీఆర్ బిడ్డగా నేను ఎంతో బాధపడుతున్నా. హరీశ్రావు, సంతోష్ వెనుక రేవంత్రెడ్డి ఉన్నారు. వారి మధ్య లోపాయకారి ఒప్పందం కుదిరింది. హరీశ్రావు, సంతోష్ను రేవంత్ రెడ్డి ఏమీ అనరు. నా తండ్రిపైనే బాణం వేస్తారు. కేసీఆర్ మీద సీబీఐ దర్యాప్తు వేశాక పార్టీ ఉంటే ఏంటి ? లేకపోతే ఏంటి ? ఇది నా తండ్రి పరువునకు సంబంధించింది. నా లేఖ బయటకు వచ్చినా నేను ఎవరి పేర్లు బయటపెట్టలేదు. రేవంత్రెడ్డి ప్రీ-ప్లాన్డ్గా సీబీఐ పేరు చెప్పారు.
కేసీఆర్ హిమాలయ పర్వతం లాంటి వారు. ఆయనకు అవినీతి మరక అంటితే బాధగా ఉంది. నాకు పెళ్లి చేసేందుకు కూడా మా నాన్న ఆర్థిక ఇబ్బంది పడ్డారు. దేవుడి లాంటి నా తండ్రిపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశిస్తే నాకు బాధగా ఉండదా ? కేసీఆర్ని నిన్న అన్ని మాటలు అంటుంటే, ఒక్కరు కూడా నోరు విప్పకపోవడం ఏంటి? రేవంత్.. మీకు దమ్ముంటే.. లోపాయకారీ ఒప్పందం లేకపోతే నేను పేర్లు కూడా చెప్పా.. చర్యలు తీసుకోండి. బీసీల రిజర్వేషన్లపైనా బిల్ పెడతారు. కానీ, ఎందుకు సుప్రీం కోర్టు దాకా వెళ్లి పోరాడటం లేదు. బిహార్ కోసం తెలంగాణ బీసీ బిడ్డలను రేవంత్ బలి చేస్తున్నారు. తెలంగాణ జాగృతి నుంచి బిహార్ వెళ్లి మీ బండారం బయటపెడతాం. సీబీఐ కాదు, ఇంకే ఎంక్వైరీ వేసిన కేసీఆర్ కడిగిన ముత్యంలా వస్తారు’’ అని ధీమా వ్యక్తం చేశారు.
Also Read : Bathukamma Festival: గిన్నిస్ బుక్ రికార్డ్స్ లక్ష్యంగా బతుకమ్మ వేడుకలు ?
