MLC Kavitha Women Reservation : చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించడానికి మహిళా బిల్లును తీసుకురావాలంటూ ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(MLC Kavitha Women Reservation) ఉద్యమాన్ని ఉదృతం చేశారు. ఈ మేరకు ఆమె సామాజిక మాధ్యమాల్లో ఒక పోస్టర్ను విడుదల చేశారు. ‘ మహిళలకు సాధికారత కల్పిద్దాం, దేశానికి సాధికారత కల్పిద్దాం. మహిళల రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వండి. మహిళా రిజర్వేషన్ బిల్లు ఎందుకు ప్రాధాన్యం కాకూడదంటూ’ పోస్టర్ లో పేర్కొన్నారు.
మహిళా రిజర్వేషన్ల కోసం వివిధ రూపాల్లో దేశవ్యాప్తంగా కార్యక్రమాలను రూపొందించనున్నట్లు వెల్లడించారు.వచ్చే నెలలో దేశంలోని యూనివర్సిటీలు కాలేజీల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు, చర్చలు నిర్వహించనున్నారు.
మహిళా బిల్లుకు మద్దతు కోసం దేశంలోని ప్రముఖ విద్యావేత్తలు, ప్రొఫెసర్లు, ఆలోచనపరులు, మేధావులకు ఆమె పోస్టు కార్డులు రాయాలని కార్యచరణను తయారు చేశారు. ఇప్పటికే జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేయడంతోపాటు దాదాపు 18 పార్టీలతో , ఆయా మహిళా, సంఘాలతో భారత్ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన విషయం విధితమే.
ఈ పార్లమెంటు సమావేశాల్లోనే మహిళా బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని కవితతో పాటు పలు పార్టీల నేతలు డిమాండ్ చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం విస్మరించినందున ఆందోళనని మరింత తీవ్ర రూపం చేయాలని నిర్ణయించారు.
అందులో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ రూపాల్లో కార్యక్రమాలు చేపట్టనున్నారు. కాగా .. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి ఆమె ఈడీ విచారణకు హాజరవుతుంది. సీబీఐ 34 మందిపై అభియోగాలు మోపింది. ఇప్పటి వరకు 11 మందిని అరెస్ట్ చేసింది. ఇందులో మాజీ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కూడా ఉన్నారు. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయుడిని కూడా అరెస్ట్ చేసింది.
Also Read : చట్టవిరుద్ధమైన సంస్థలో సభ్యత్వం పొందడం UAPA నేరం