Vijay Rupani: మాజీ సీఎం విజయ్‌ రూపాణీ కుటుంబసభ్యులకు ప్రధాని మోదీ పరామర్శ

మాజీ సీఎం విజయ్‌ రూపాణీ కుటుంబసభ్యులకు ప్రధాని మోదీ పరామర్శ

Vijay Rupani : అహ్మదాబాద్‌ నుంచి లండన్‌ కు బయలుదేరిన ఎయిరిండియా విమానం గురువారం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 265 మంది చనిపోగా… ఒకే ఒక్కడు మృత్యుంజయుడిగా బ్రతికి బట్టకట్టాడు. ఈ ప్రమాదంలో బీజేపీ సీనియర్ నేత, గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాణీ (Vijay Rupani) కూడా మృతి చెందారు. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్ లో పర్యటించిన ప్రధాని మోదీ (PM Modi)… శుక్రవారం ఘటనాస్థలానికి వెళ్లి అక్కడి పరిస్థితిని పరిశీలించారు. తరువాత సివిల్ ఆసుపత్రికి చేరుకుని అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బీజేపీ సీనియర్ నేత, గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి విజయ్‌రూపాణీ (Vijay Rupani) కుటుంబసభ్యులను ప్రధాని పరామర్శించారు. ఆయన మృతిపట్ల సంతాపం తెలిపారు.

PM Modi Visit Vijay Rupani

ఈ సందర్భంగా పీఎం మోదీ… విజయ్‌ భాయ్ మన మధ్య లేరనేది ఊహించలేనిదన్నారు. తనకు దశాబ్దాలుగా ఆయన తెలుసన్న మోదీ… భుజం భుజం కలిపి… తామిద్దరం కలిసి పనిచేశామని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అత్యంత సవాలుతో కూడిన సమయాల్లో కూడా విజయ్‌ భాయ్ వినయపూర్వకంగా కష్టపడి పనిచేసేవారని మోదీ అన్నారు. పార్టీ సిద్ధాంతానికి దృఢంగా కట్టుబడి ఉండేవారని, ఉన్నత స్థాయికి ఎదిగి, వివిధ బాధ్యతలను నిర్వహించి, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎంతోశ్రద్ధాశక్తులతో సేవలందించారని మోదీ కీర్తించారు. రాజ్‌కోట్ మున్సిపల్ కార్పొరేషన్‌ లో అయినా, రాజ్యసభ ఎంపీగా అయినా, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా అయినా, క్యాబినెట్ మంత్రిగా, రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా అయినా, ఆయనకు కేటాయించిన ప్రతి బాధ్యతలోనూ ఆయన ఎల్లప్పుడూ ఒక ప్రత్యేకమైన ప్రతిభను కనబరిచారని మోదీ చెప్పారు.

విజయ్‌భాయ్ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనతో కలిసి పనిచేసే అవకాశం తనకు లభించిందని, గుజరాత్ అభివృద్ధి ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఆయన అనేక చర్యలు తీసుకున్నారని ప్రధాని మోదీ అన్నారు. వాటిలో ‘ఈజ్ ఆఫ్ లివింగ్’ ముఖ్యమైనదని చెప్పారు. ఆయనతో జరిగిన సమావేశాలు, చర్చలు ఎల్లప్పుడూ గుర్తుండి పోతాయని మోదీ బాధాతప్త హృదయంతో అన్నారు. ఓం శాంతి.. అంటూ మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

గుజరాత్‌ మాజీ సీఎం, భాజపా సీనియర్‌ నేత విజయ్‌ రూపాణీ కూడా ఈ ప్రమాదంలో మృతి చెందారు. లండన్‌లో ఉంటున్న తన కుమార్తెను చూసేందుకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆయన 2016 నుంచి 2021 వరకు రెండు సార్లు గుజరాత్‌ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె కాగా… చిన్న కుమారుడు పూజిత్‌ ఓ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.

విజయ్‌ రూపాణీకి చివరి ప్రయాణంలో కలిసి రాని లక్కీ నంబర్‌

కొన్ని నంబర్లు తమకు అదృష్టాన్ని తెచ్చిపెడతాయని చాలా మంది నమ్ముతారు. ఎంత ఖర్చయినా తమ వాహనాలకు లక్కీ నంబర్లు వచ్చేలా చూసుకుంటారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాణీ లక్కీ నంబర్ 1206. ఆయన ప్రతీ వాహనం అదే నంబరుతో ఉంటుంది. ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానంతో అతని సీటు నెంబరు కూడా 12 అయితే అనూహ్యంగా ఆయన చివరి ప్రయాణం 1206 సంఖ్య కలిగిన తేదీతో ముగిసింది. దీనితో రూపాణీకు చివరి మజిలీలో లక్కీ నెంబరు పనిచేయలేదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Also Read : PM Narendra Modi: అహ్మదాబాద్‌ లో ఘటనా స్థలాన్ని పరిశీలించిన ప్రధాని మోదీ

Leave A Reply

Your Email Id will not be published!