Mohan Charan Majhi: ఒడిశా కొత్త ముఖ్యమంత్రిగా గిరిజన నేత మోహన్‌ మాఝీ !

ఒడిశా కొత్త ముఖ్యమంత్రిగా గిరిజన నేత మోహన్‌ మాఝీ !

Mohan Charan Majhi: ఒడిశాలో తొలిసారి బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా మోహన్‌ చరణ్‌ మాఝీని పేరును కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రకటించారు. అలాగే కనక్‌ వర్ధన్‌ సింగ్‌ డియో, ప్రవటి పరిదాలను ఉప ముఖ్యమంత్రులుగా ప్రకటించారు. మంగళవరాం భువనేశ్వర్‌ లో జరిగిన బీజేపీఎల్పీ(BJP) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ భేటీకి బీజేపీ అధిష్ఠానం తరఫున పరిశీలకులుగా కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, భూపేందర్‌ యాదవ్‌ హాజరయ్యారు.

రాష్ట్రంలో కమలదళ సీనియర్‌ నేతల్లో ఒకరైన మాఝీ… ఇప్పటివరకు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కియోంజర్‌ స్థానం నుంచి ఆయన విజయం సాధించారు. రెండున్నర దశాబ్దాల తర్వాత రాష్ట్రంలో కొత్త ముఖ్యమంత్రిగా మోహన్‌ మాఝీ(Mohan Charan Majhi) బాధ్యతలు చేపట్టనున్నారు. 1997-2000 వరకు సర్పంచ్‌ గా పనిచేసిన ఆయన… 2000లో తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2009, 2019తోపాటు తాజా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. బలమైన గిరిజన నేతల్లో ఒకరిగా ఎదిగారు. జూన్‌ 12న సీఎం ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరు కానున్నట్లు తెలుస్తోంది.

Mohan Charan Majhi – కొత్త సీఎంకు ‘నివాసం’ కరవు !

మరికొన్ని గంటల్లో ఒడిశాలో బీజేపీ(BJP) ప్రభుత్వం కొలువుదీరనుంది. ఈ క్రమంలోనే సీఎం అధికారిక నివాసం కోసం కాషాయ పార్టీ అన్వేషణ మొదలుపెట్టింది. గత రెండు దశాబ్దలకు పైగా ముఖ్యమంత్రిగా కొనసాగిన నవీన్‌ పట్నాయక్‌… తన సొంత ఇంటినుంచే కార్యకలాపాలు సాగించడంతో… ఇప్పుడు కొత్త సీఎం అధికారి నివాసం కోసం అన్వేషణ చేయాల్సి వస్తోంది. 2000లో జరిగిన ఎన్నికల్లో బీజేడీ అధినేత నవీన్‌ పట్నాయక్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే.. నాడు ప్రభుత్వం కేటాయించిన భవనంలో కాకుండా భువనేశ్వర్‌లోని తన సొంత నివాసం ‘నవీన్‌ నివాస్‌’ నుంచే పని చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. నాటి నుంచి తాజా ఎన్నికల వరకు అక్కడినుంచే విధులు నిర్వర్తించారు. మిగతా పాలనా విభాగాలు సైతం ఇక్కడినుంచే పని చేశాయి. నవీన్‌ నివాస్‌ ను ఆయన తండ్రి, దివంగత నేత బిజూ పట్నాయక్‌ నిర్మించారు.

అంతకుముందు ముఖ్యమంత్రులుగా పనిచేసిన హేమానంద బిస్వాల్‌, జానకీ బల్లభ్‌ పట్నాయక్‌లు భువనేశ్వర్‌ క్లబ్‌ సమీపంలోని ఓ చిన్న భవనం నుంచి కార్యకలాపాలు సాగించారు. 1995లో జేబీ పట్నాయక్‌ ఎన్నికైన తర్వాత అక్కడినుంచి ఓ రెండంతస్తుల భవనంలోకి మార్చారు. పట్నాయక్‌ కుటుంబానికి చెందిన అసలైన బంగ్లా (ఆనంద్‌ భవన్‌) పూర్వ రాజధాని కటక్‌ లో ఉంది. నవీన్‌ పట్నాయక్‌ అక్కడే జన్మించారు. ఆ తర్వాత కొత్త రాజధాని ఏర్పడిన అనంతరం భువనేశ్వర్‌కు మకాం మార్చారు. ఆనంద్‌ భవన్‌ను ప్రస్తుతం మ్యూజియంగా తీర్చిదిద్దారు.

ఒడిశాలో తిరుగులేని నేతగా ఉన్న నవీన్‌ పట్నాయక్‌ 24 ఏళ్లకు పైగా రాష్ట్రాన్ని పాలించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చేతిలో బీజేడీ ఓడిపోయింది. రాష్ట్రంలో తొలిసారి తమ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు కసరత్తు చేస్తోన్న బీజేపీ… జూన్‌ 12న కొత్త సీఎం ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ కూడా హాజరుకానున్నట్లు సమాచారం. అయితే, కొత్త సీఎం తాత్కాలిక నివాసంగా స్టేట్‌ గెస్ట్‌ హౌస్‌లో ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.

Also Read : PM Narendra Modi: ప్రమాణ స్వీకారం తరువాత మోదీ తొలి విదేశీ పర్యటన ! ఎక్కడికంటే ?

Leave A Reply

Your Email Id will not be published!