New Liquor Brands: తెలంగాణలో 604 కొత్త మద్యం బ్రాండ్లకు దరఖాస్తులు
తెలంగాణలో 604 కొత్త మద్యం బ్రాండ్లకు దరఖాస్తులు
New Liquor Brands : తెలంగాణలో మద్యం సరఫరా చేసేందుకు 604 కొత్త మద్యం బ్రాండ్లకు(New Liquor Brands) దరఖాస్తులు వచ్చినట్లు తెలంగాణ అబ్కారీ శాఖ వెల్లడించింది. 604 కొత్త మద్యం బ్రాండ్ల అమ్మకాల అనుమతి కోసం 92 మద్యం సరఫరా కంపెనీలు దరఖాస్తు చేసినట్లు తెలిపింది. ఇందులో 331 రకాల స్వదేశీ లిక్కర్ బ్రాండ్లు కాగా… 273 రకాల విదేశీ లిక్కర్ బ్రాండ్లకు దరఖాస్తుల వచ్చాయని పేర్కొంది. 47 కొత్త కంపెనీల నుంచి 386 రకాల కొత్త మద్యం బ్రాండ్లకు దరఖాస్తులు రాగా… 45 పాత కంపెనీల నుంచి 218 కొత్త మద్యం బ్రాండ్లకు దరఖాస్తులు వచ్చినట్లు తెలిపింది.
దేశీయ, విదేశీ మద్యం బ్రాండ్ల కోసం టీజీబీసీఎల్ (తెలంగాణ బేవరేజ్ కార్పోరేషన్ లిమిటెడ్) దరఖాస్తులను ఆహ్వానిస్తూ… ఫిబ్రవరి 23న నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ(Telangana)లో తొలిసారిగా కొత్త మద్యం బ్రాండ్ల అమ్మకాల కోసం 47 కొత్త కంపెనీలు 386 రకాల మద్యం బ్రాండ్లకు దరఖాస్తు చేసుకున్నాయంది. ఏప్రిల్ 2వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకొనేందుకు అవకాశం కల్పించినట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కమిషనర్ సి.హరికిరణ్ వివరించారు. ఈ దరఖాస్తుల పరిశీలన అనంతరం కొత్త బ్రాండ్లకు ప్రభుత్వ ఆమోద ముద్ర పడిన తర్వాత అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు.
New Liquor Brands – బార్స్ అసోసియేషన్ వర్సెస్ తెలంగాణ వైన్స్ డీలర్స్
మరొకవైపు వైన్స్లపై బార్స్ అసోసియేషన్ చేసిన వ్యాఖ్యలపై వైన్స్ డీలర్స్ అసోసియేషన్ ఘాటుగా స్పందించింది. మద్యంపై ప్రభుత్వ ఆదాయంలో వైన్స్ వాటా 85 శాతం కాగా, బార్ల నుంచి ప్రభుత్వానికి 15 శాతం వాటానే వస్తోందని ఆరోపించింది. అయినా బార్లకు ఉన్న వెసులుబాటు వైన్ షాపులకు లేవని, బార్లు రాత్రి 12 గంటల వరకూ నడుస్తున్నాయని కౌంటరిచ్చింది. వైన్స్లు మాత్రం రాత్రి 10 గంటలకే మూసివేయాలని బార్స్ అసోసియేషన్ అనడం తగదని వైన్స్ డీలర్స్ అసోసియేషన్ పేర్కొంది.