Uttarakhand : ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు ! 9 మంది గల్లంతు !
ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు ! 9 మంది గల్లంతు !
Uttarakhand : ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరకాశీ జిల్లాలోని బార్కోట్-యుమునోత్రి మార్గంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 9 మంది గల్లంతయ్యారు. మరో 10 మందిని ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామి స్పందించారు. తాజా పరిస్థితులపై అధికారులతో నిరంతరం సమీక్షిస్తున్నట్లు తెలిపారు.
Uttarakhand – చార్ ధామ్ యాత్రకు బ్రేక్
భారీ వర్షాలతో ఉత్తరాఖండ్ (Uttarakhand) అతలాకుతలం అవుతోంది. ఈ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో రహదారులపై భారీగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ (Uttarakhand) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చార్ ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆదివారం నాడు అధికారికంగా ప్రకటించింది. 24 గంటలు… అంటే ఒక రోజుపాటు ఈ యాత్రను నిలిపి వేయాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం వివరించింది. హరిద్వార్, రిషికేశ్, శ్రీనగర్, రుద్రప్రయాగ్, సోన్ప్రయాగ్, వికాస్ నగర్ వద్ద యాత్రికులను ఆపాలని స్థానిక యంత్రాంగానికి సమాచారమందించారు. వాతావరణ పరిస్థితులు ఏ మాత్రం అనుకూలించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. భారీగా కొండచరియలు విరిగిపడడంతో రహదారులు వివిధ ప్రాంతాల్లో మూసుకుపోయాయని పేర్కొంది.
ఈ నేపథ్యంలో ఎక్కడి వారు అక్కడ ఉండి పోవాలని యాత్రికులకు ప్రభుత్వం సూచించింది. వాతావరణ పరిస్థితులు, రహదారులపై శిథిలాలను శుభ్రం చేసిన తర్వాత యాత్ర చేపట్టాలని స్పష్టం చేసింది. మరోవైపు హరిద్వార్, రుషికేశ్, శ్రీనగర్, రుద్ర ప్రయాగ్, సోన్ ప్రయాగ్, వికాస్ నగర్ తదితర ప్రాంతాల్లో యాత్రికులు తాత్కాలికంగా నివసించేందుకు ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే పోలీసులు, ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని ఘర్వాల్ డివిజన్ కమిషనర్ వినయ్ శంకర పాండే వెల్లడించారు.
చార్ ధామ్ యాత్ర… ఏప్రిల్ 30వ తేదీన ప్రారంభమైన సంగతి తెలిసిందే. అక్షయ తృతీయ సందర్భంగా గంగోత్రి, యమునోత్రిలలో ఈ యాత్ర ప్రారంభమైంది. ఇక మే 2వ తేదీన కేథార్నాథ్, మే 4వ తేదీన బద్రీనాథ్ యాత్రలు ప్రారంభమైన విషయం విదితమే. ఈ నాలుగు దేవాలయాలు.. ఏడాదిలో ఆరు మాసాలు మాత్రమే తెరిచి ఉంటాయి. శీతాకాలంలో భారీ చలి గాలులు కారణంగా.. అక్టోబర్, నవంబర్ మాసాల్లో ఈ దేవాలయాలను మూసి ఉంచుతారు.
ఇంకోవైపు ఉత్తర కాశీ జిల్లాలో ఆదివారం ఉదయం నాడు మేఘ విస్పోటనం సంభవించింది. దీనితో అతి భారీ వర్షం కురిసింది. ఈ కారణంగా యమునోత్రి జాతీయ రహదారి సమీపంలోని హోటల్ నిర్మాణంలో పాల్గొన్న 9 మంది కార్మికులు గల్లంతయ్యారు. వీరంతా నేపాల్ ప్రాంతానికి చెందిన వారని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. అలాగే భారీ వర్షాలు, కొండ చరియలు విరిగిపడుతున్న కారణంగా వివిధ ప్రాంతాల్లో రహదారులు తాత్కాలికంగా మూసి వేసినట్లు తెలిపింది.
Also Read : Jagannath Rath Yatra: పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట ! ముగ్గురి మృతి !
