Amarnath Yatra: నో ఫ్లైయింగ్ జోన్ గా అమర్నాథ్ యాత్రా మార్గాలు
నో ఫ్లైయింగ్ జోన్ గా అమర్నాథ్ యాత్రా మార్గాలు
Amarnath Yatra : మంచు లింగాన్ని దర్శించుకోవడానికి ఏటా వేల మంది యాత్రికులు అమర్నాథ్ యాత్రకు వెళ్తున్న విషయం తెలిసిందే. అయితే పహాల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో అమర్నాథ్ యాత్ర కోసం భద్రతా చర్యలను పెంచడంలో భాగంగా జమ్మూకశ్మీర్ ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసింది. ఇందులో భాగంగానే… అమర్నాథ్ యాత్ర వెళ్లే అన్ని మార్గాలను ‘నో ఫ్లయింగ్ జోన్’గా ప్రకటించింది. ఈ మేరకు జమ్మూకశ్మీర్ హోం శాఖ మంగళవారంనాడు ఉత్తర్వులు జారీ చేసింది. జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.
Amarnath Yatra – No Flying
భక్తులు అమర్ నాథ్ యాత్రకు (Amarnath Yatra) పహల్గాం మార్గంతో పాటు బాల్తాల్ మీదుగా వెళ్తుంటారు. ఈ మార్గాలను నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించారు. జూలై 1 నంచి ఆగస్టు 10వ తేదీ వరకూ ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయి. 38 రోజుల పాటు జరిగే అమర్నాథ్ యాత్ర జూలై 3న ప్రారంభమై ఆగస్టు 8వ తేదీతో ముగుస్తుంది. నో ఫ్లయింగ్ జోన్లు ప్రకటించిన మార్గాల్లో యూఏవీలు, డ్రోన్లు, బెలూన్లు వంటివి ఎగరవేయడంపై నిషేధం విధించారు. అయితే అత్యవసర వైద్య తరలింపు, విపత్తు నిర్వహణ, భద్రతా దళాల నిఘా వంటి సందర్భాల్లో ఈ ఆంక్షలు వర్తించవని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అమర్నాథ్ యాత్ర కోసం ఈ ఏడాది వివిధ కేంద్ర పోలీసు బలగాలకు చెందిన 581 కంపెనీలను మోహరిస్తున్నారు. తొలిసారి అమర్నాథ్ యాత్రకు ఎస్కార్ట్గా ఉండే సీఏపీఎఫ్ కాన్వాయ్ పరిరక్షణ కోసం జామర్లు కూడా ఏర్పాటు చేయనున్నారు.
Also Read : Indigo: ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు ! నాగపూర్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ !