NTPC: ఎన్టీపీసీ ప్రాజెక్టులో భారీ అగ్నిప్రమాదం ! రూ.400 కోట్లు ఆస్తి నష్టం !
ఎన్టీపీసీ ప్రాజెక్టులో భారీ అగ్నిప్రమాదం ! రూ.400 కోట్లు ఆస్తి నష్టం !
NTPC : గుజరాత్ దాహోద్ లోని భటివాడలో నిర్మాణంలో ఉన్న నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోని 70 మెగావాట్ల సోలార్ ప్లాంట్ లో సోమవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్ని ప్రమాదంలో ప్లాంట్ లోని 95% పరికరాలు కాలి బూడిదయ్యాయి. దీనితో దాదాపు రూ. 400 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా చెబుతున్నారు. ఈ అగ్నిప్రమాదం జరిగిన తర్వాత రంగంలోకి దిగిన సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…
సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో భటివాడలో నిర్మాణంలో ఉన్న నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(NTPC) ఆధ్వర్యంలోని 70 మెగావాట్ల సోలార్ ప్లాంట్ లో మంటలు మొదలైనట్లు తెలుస్తోంది. గాలి కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయి. ఫలితంగా ప్లాంట్ లో ఉన్న సోలార్ ప్యానెల్ లు, ట్రాన్స్ఫార్మర్లు, కేబుల్స్ ఇతర పరికరాలు కాలిపోయాయి. NTPC సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. కానీ మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో దానిని నియంత్రించడం అసాధ్యంగా మారింది. దాహోద్, చుట్టుపక్కల జిల్లాల నుంచి అగ్నిమాపక బృందాలను రప్పించారు. కానీ మంటలు చాలా తీవ్రంగా ఉండటం వలన వాటిని ఆర్పడం కష్టంగా మారింది. చివరకు 13 గంటల పాటు శ్రమించిన తర్వాత మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
NTPC – అగ్నిప్రమాదం వెనుక కుట్ర దాగి ఉండొచ్చని అనుమానం
ఈ అగ్నిప్రమాద ఘటన వెనుక కుట్ర జరిగిందనే అనుమానం వ్యక్తమవుతోంది. చుట్టుపక్కల గ్రామాల నుంచి కొంతమంది సోలార్ ప్లాంట్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆయా వ్యక్తులు గతంలో ఈ ప్రాజెక్టు విషయంలో కూడా అడ్డంకులను సృష్టించారు. సోమవారం పగటిపూట ప్లాంట్ పై రాళ్లు రువ్వడంతో అనేక మంది కార్మికులు గాయపడ్డారు. గాయపడిన కార్మికులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. రాళ్లు రువ్విన వారి ఫోటోలు ప్లాంట్ లోని సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. స్థానికుల నిరసనలు, రాళ్ల దాడి తరువాత, ఉద్దేశపూర్వకంగా నిప్పు పెట్టారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
స్థానికుల సమాచారంతో డీఎస్పీ డాక్టర్. రాజ్దీప్ సింగ్ ఝాలా సహా సీనియర్ పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు, దాని వెనుక ఉన్న కుట్రపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. NTPC ఏప్రిల్ 4 నుంచి ఏప్రిల్ 18 వరకు పోలీసు రక్షణలో ప్లాంట్ కు కంచె వేసే పనిని చేపట్టింది. అయితే, స్థానిక ప్రజల వ్యతిరేకత కారణంగా రెండు రోజుల క్రితం పనులు ఆగిపోయాయి. సోమవారం పనిని తిరిగి ప్రారంభించడానికి ఒక ఒప్పందం కుదిరింది. కానీ ఆ సమయంలో ఒక వ్యక్తి మోటార్ సైకిల్ పై వచ్చి పని ఆపకపోతే చర్య తీసుకుంటామని బెదిరించాడు. అతనితో పాటు 5-7 మంది వచ్చి రాళ్ళు విసరడం ప్రారంభించారని తెలిపారు. ఆ తర్వాత వారే నిప్పంటించారా లేదా అనేది ఆరా తీస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
Also Read : Ex DGP Om Prakash: కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ హత్య కేసులో విస్తుపోయే నిజాలు