Operation Prakasam Barrage: ముగిసిన ఆపరేషన్ ప్రకాశం బ్యారేజీ ! మూడో పడవ కూడా వెలికితీత !

ముగిసిన ఆపరేషన్ ప్రకాశం బ్యారేజీ ! మూడో పడవ కూడా వెలికితీత !

విజయవాడ ప్రకాశం బ్యారేజి వెనుక చిక్కుకున్న పడవలన్నింటినీ అధికారులు దిగ్విజయంగా ఒడ్డుకు చేర్చారు. శనివారం చివరి పడవనూ ఒడ్డుకు చేర్చి.. 12 రోజుల ఆపరేషన్‌కు ముగింపు పలికారు. ఈ నెల 1న బ్యారేజికి భారీ వరద వచ్చినప్పుడు పడవలు దూసుకొచ్చి గేట్ల పైభాగంలోని కౌంటర్‌ వెయిట్లను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. దీనితో గత 12 రోజులుగా ఇంజినీర్లు, అధికారులు శతవిధాలుగా ప్రయత్నించి 17న ఒకటి, 19న మరో పడవను ఒడ్డుకు తీసుకొచ్చారు.

మూడో పడవ 69వ గేటు వద్ద బోర్లా పడి ఉండడంతో తొలుత దాన్ని సవ్య దిశలోకి మార్చి, నీటిలో మునిగి ఉండగానే గడ్డర్లతో అనుసంధానించి మరో రెండు పడవల సాయంతో శనివారం ఒడ్డుకు లాక్కొచ్చారు. విజయవాడలోని పున్నమి ఘాట్‌ వద్ద లంగరు వేసి, తాళ్లతో కట్టేశారు. మొదట 5 పడవలు బ్యారేజి వద్ద చిక్కుకున్నాయని భావించిన నేపథ్యంలో జలాల్లో పూర్తిగా గాలించి, అక్కడ లేవని నిర్ధారించారు. పడవలను ఒడ్డుకు చేర్చేందుకు బెకమ్‌ సంస్థ, విశాఖ సీ లయన్, కాకినాడ అబ్బులు, సదాశివరావు బృందాల ఆధ్వర్యంలో రోజూ సుమారు 90 మంది తీవ్రంగా శ్రమించారు.

Leave A Reply

Your Email Id will not be published!