Operation Sindhu: ఇజ్రాయెల్ నుంచి భారతీయుల తరలింపు ప్రారంభం
ఇజ్రాయెల్ నుంచి భారతీయుల తరలింపు ప్రారంభం
Operation Sindhu : ఇజ్రాయెల్- ఇరాన్ పరస్పర దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనితో ఈ దేశాల్లోని భారతీయులను స్వదేశానికి తరలించేందుకు ప్రభుత్వం ‘ఆపరేషన్ సింధు’ (Operation Sindhu) ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఇరాన్ నుంచి వెయ్యి మందికిపైగా పౌరులను భారత్కు తీసుకొచ్చింది. తాజాగా ఇజ్రాయెల్ నుంచి తరలింపు ప్రక్రియ ప్రారంభించింది. ఈ క్రమంలోనే 160 మందితో కూడిన తొలి బ్యాచ్ ఇజ్రాయెల్ నుంచి జోర్డాన్ సరిహద్దుకు చేరుకుంది.
Operation Sindhu Updates
ఇజ్రాయెల్ లో దాదాపు 40 వేలమంది భారతీయులు వివిధ రంగాల్లో పనిచేస్తున్నారు. ఇరాన్ దాడులతో స్థానికంగా పరిస్థితులు దిగజారుతుండటంతో… అక్కడి భారతీయుల తరలింపునకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు స్థానిక రాయబార కార్యాలయం అవసరమైన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా తొలి బ్యాచ్ కింద టెల్అవీవ్, హైఫాల నుంచి 160 మంది భారతీయులను రోడ్డు మార్గంలో జోర్డాన్ సరిహద్దుకు తరలించింది. ఇజ్రాయెల్ గగనతలం మూసిఉండటంతో జోర్డాన్ మీదుగా వారిని స్వదేశానికి తీసుకురానుంది. విదేశాంగశాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానాలు జోర్డాన్ రాజధాని అమ్మాన్ నుంచి దిల్లీకి చేరుకోనున్నాయి. రానున్న రోజుల్లో ఈజిప్టు నుంచీ ప్రత్యేక విమానాలు నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
మరోవైపు.. ఇరాన్ నుంచి భారతీయుల తరలింపు కొనసాగుతోంది. ఆదివారం మరో 311 మంది ప్రత్యేక విమానంలో దిల్లీకి చేరుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 1428 మందిని ఇరాన్ నుంచి స్వదేశానికి తరలించినట్లు విదేశాంగశాఖ వెల్లడించింది.
Also Read : CM Devendra Fadnavis: రాహుల్ కు ‘మేకిన్ ఇండియా’ అంటే ఏంటో తెలియదు – సీఎం ఫడ్నవీస్
