Pakistan Spy: పాకిస్థాన్‌ కోసం గూఢచర్యం కేసులో యూపీ వ్యాపారవేత్త అరెస్టు

పాకిస్థాన్‌ కోసం గూఢచర్యం కేసులో యూపీ వ్యాపారవేత్త అరెస్టు

 

 

పహల్గాం దాడి అనంతరం ఉగ్రవాదులను, వారికి సహకరిస్తున్న గూఢచారలను ఏరివేయడానికి భారత ప్రభుత్వం తీవ్రంగా గాలింపులు చేపడుతోంది. ఇందులోభాగంగా దేశంలో ఉంటూ ఉగ్రవాదులకు సహకరిస్తున్న దేశద్రోహులను గుర్తించడానికి నిఘా వర్గాలు జల్లెడ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో పాక్‌కు గూఢచర్యం చేస్తున్న పలువురిని ఇప్పటికే అధికారులు అదుపులోకి తీసుకోగా… తాజాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యాపారవేత్తను గూఢచర్యం ఆరోపణలతో అరెస్ట్‌ చేసినట్లు స్పెషల్ టాస్క్ ఫోర్స్ పేర్కొంది.

యూపీలోని రాంపుర్‌కు చెందిన వ్యాపారవేత్త షాజాద్‌ పాకిస్థాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ తరఫున సరిహద్దుల్లో అక్రమ రవాణా, గూఢచర్యం చేస్తున్నట్లు గుర్తించామని అధికారులు పేర్కొన్నారు. ఐఎస్‌ఐతో సంబంధాలు కొనసాగిస్తూ… జాతీయ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాక్‌కు చేరవేస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని తెలిపారు. గూఢచర్యం సమాచారాన్ని పంచుకునేందుకు అతడు పలుమార్లు పాక్‌ వెళ్లొచ్చాడని… పాక్‌ కు సౌందర్య సాధనాలు, దుస్తులు, సుగంధ ద్రవ్యాలు ఇతర వస్తువుల రవాణా ముసుగులో ఈ చర్యలకు పాల్పడేవాడని అన్నారు. షాజాద్‌ భారత్‌లో పలు సిమ్‌కార్డ్‌లను కొనుగోలు చేసి దేశంలో ఉన్న ఐఎస్‌ఐ ఏజెంట్లకు అందించేవాడని… ఉత్తరప్రదేశ్‌ లో ఉన్న పలువురు యువకులను ఉగ్రవాదం వైపు ప్రోత్సహించి… ఐఎస్‌ఐలో చేరడానికి పాక్‌ కు పంపించేవాడని అధికారులు తెలిపారు. అలా ఆ దేశానికి వెళ్లే వారికోసం ఉగ్రగవాదులు వారికి వీసాలు ఏర్పాటుచేసేవారని అన్నారు.

 

జమ్మూకశ్మీర్‌ లో ఉగ్రవాదుల సహాయకుల అరెస్ట్

 

 

ఉగ్రవాదుల కోసం జమ్మూకశ్మీర్‌ సహా పలు సరిహద్దు ప్రాంతాల్లో సైన్యం, పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. అందులోభాగంగా ఇప్పటికే కొందరు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకొని.. పలు ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశారు. ఆదివారం రాత్రి షోపియాన్‌ ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్, ఇండియన్‌ ఆర్మీ బలగాలు చేపట్టిన సంయుక్త ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదుల సహాయకులను అరెస్టు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. వారి నుంచి రెండు పిస్టళ్లు, నాలుగు గ్రనేడ్లు, 43 లైవ్‌ రౌండ్స్‌ స్వాధీనం చేసుకున్నామన్నారు.

హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాక్ కోసం గూఢచర్యం చేస్తూ దొరికిపోయిన విషయం తెలిసిందే. ట్రావెల్ విత్ జో పేరిట ఆమె నిర్వహించే ఛానల్‌కు సుమారు 3 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఢిల్లీలోని పాక్ హైకమిషన్‌లో పనిచేస్తున్న ఓ ఉద్యోగితో ఆమె టచ్‌లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో మే 13న భారత ప్రభుత్వం సదరు పాక్ ఉద్యోగిని గూఢచర్యం నేరంపై బహిష్కరించింది. ఇదిలా ఉంటే జ్యోతి మల్హోత్రా ఓసారి పాక్‌ను సందర్శించి ఆ పర్యటన తాలూకు వీడియోలను కూడా నెట్టింట షేర్ చేసింది.

Leave A Reply

Your Email Id will not be published!