Teacher Kidnap: ఆస్తి కోసం కన్నకూతురినే కిడ్నాప్ చేసిన తల్లిదండ్రులు
ఆస్తి కోసం కన్నకూతురినే కిడ్నాప్ చేసిన తల్లిదండ్రులు
అనంతపురం జిల్లాలోని కంబదూరు మండలం కురాకులపల్లిలో సంచలనం సృష్టించిన టీచర్ తిరుపతమ్మ కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులే కూతురిని కిడ్నాప్ చేసినట్లు పోలీసులు నిర్దారించారు. ఎస్జీటీ టీచర్గా విధులు నిర్వహిస్తున్న తిరుపతమ్మ… తల్లిదండ్రులను ఎదురించి ఇటీవల ప్రేమ వివాహం చేసుకుంది. దీనితో ఆమెపై కక్ష పెంచుకున్న తల్లిదండ్రులు… పక్కా ప్రణాళికతో భర్తతో కలిసి తిరుపతమ్మ బైక్పై వెళ్తుండగా కిడ్నాప్ చేశారు. ఈ కిడ్నాప్ కేసుకు సంబంధించి 11 మందిని అరెస్ట్ చేసిన కంబదూరు పోలీసులు… సోమవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు.
పోలీసుల కథనం ప్రకారం…కురాకులపల్లికి చెందిన తిరుపతమ్మకు 32 సంవత్సరాలు వచ్చినప్పటికీ తల్లిదండ్రులు పెళ్లి చేయలేదు. ప్రభుత్వ టీచర్ అయిన తిరుపతమ్మకు పెళ్లి చేస్తే తమ జీవనాధారం పోతుందని భావించిన వారు పెళ్లి చేయకుండా ఇంటి వద్దే ఉంచుకున్నారు. దీనితో తిరుపతమ్మ స్వయంగా పెళ్లి చేయమని అడిగితే.. వాళ్ల చెల్లెలి భర్తను పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి తీసుకువచ్చారు. దీనితో తల్లిదండ్రుల ప్రవర్తనతో విసిగిపోయిన సదరు యువతి తనను 20 ఏళ్లుగా ప్రేమిస్తున్న చిన్ననాటి మిత్రుడు తిప్పేస్వామిని పెళ్లి చేసుకుంది.
దీనితో తమ జీవనాధారం పోవడంతో పాటు… ఆస్తి మొత్తం తిప్పేస్వామికి వెళ్లిపోతుందని భావించిన తల్లిదండ్రులు ఆమెపై కక్షతో కిడ్నాప్ చేయాలని ప్రణాళిక చేశారు. అనుకున్న ప్రకారం పక్కా పథకంతో భర్తతో కలిసి బైక్ పై వెళ్తున్న కూతురు తిరుపతమ్మను కిడ్నాప్ చేసారు. అనంతరం ఆమెను బెంగుళూరుకు తరలించారు. ఆమె వద్ద ఉన్న సెల్ఫోన్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డును లాక్కున్నారు. తిరుపతమ్మ పేరు మీద ఉన్న ఆస్తులను కుటుంబసభ్యులపై ట్రాన్స్ఫర్ చేయాలని ఒత్తిడి తీసుకొచ్చారు. ఆస్తులను రాసియ్యకపోతే చంపుతామంటూ కూడా తీవ్రస్థాయిలో బెదిరింపులకు దిగారు.
దీనితో మీరు చెప్పినట్టుగానే ఆస్తులను ట్రాన్సఫర్ చేస్తానని, కళ్యాణదుర్గం వెళ్లాక తన పేరుతో ఉన్న ఆస్తులతో పాటు ఇతరత్రా ఆస్తులను కూడా ట్రాన్స్ఫర్ చేస్తానంటూ కుటుంబసభ్యులకు చెప్పింది తిరుపతమ్మ. అందులో భాగంగా బెంగళూరు నుంచి కళ్యాణదుర్గంకు తిరుపతమ్మను కుటుంబసభ్యులు తీసుకువచ్చారు. అయితే అప్పటికే తిరుపతమ్మ కిడ్నాప్ కేసు నమోదు అవడంతో పోలీసులు తనిఖీలు నిర్వహించగా… ఓ వాహనంలో యువతితో పాటు కుటుంబసభ్యులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాప్ పై పోలీసులు లోతుగా విచారించడంతో కిడ్నాప్ వెనక ఉన్న తతంగం మొత్తాన్ని కూడా వెలికి తీశారు. తిరుపతమ్మ తల్లిదండ్రులతో పాటు కుటుంబసభ్యులే ఆస్తి కోసం ఆమెను కిడ్నాప్ చేసినట్లు పోలీసులు నిర్దారించి… వారి వద్ద నుంచి కత్తి, బైక్ను సీజ్ చేసినట్లు కాప్స్ వెల్లడించారు.