Pawan Kalyan: భారత సైన్యానికి రక్షణగా పవన్ కళ్యాణ్ సర్వమత పూజలు
భారత సైన్యానికి రక్షణగా పవన్ కళ్యాణ్ సర్వమత పూజలు భారత సైన్యానికి రక్షణగా పవన్ కళ్యాణ్ సర్వమత పూజలు
పహాల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తరువాత పాకిస్తాన్, భారతదేశం మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈక్రమంలో ఇండియన్ ఆర్మీకి రక్షణగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత బలగాలకు రక్షణగా పూజలు చేయాలని పవన్ కళ్యాణ్ పార్టీ నాయకులకు సూచించారు. పాకిస్థాన్ మీద భారత బలగాలు చేస్తున్న ఆపరేషన్ సిందూర్ ధర్మ యుద్ధానికి ప్రతి ఒక్కరి నైతిక మద్దతు అవసరమని పవన్ కల్యాణ్ స్పష్టం చేసారు. శత్రు మూకలపై పోరాడుతున్న సైన్యానికి, దేశానికి నాయకత్వం వహిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దైవ బలం, ఆశీస్సులు ఉండేలా భగవంతుడిని ప్రార్థించాలని అన్నారు. శత్రు సేనలను కట్టడి చేసి, దేశాన్ని కాపాడే గొప్ప శక్తిసామర్థ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం మన త్రివిధ దళాలకు మెండుగా ఉన్నాయని చెప్పారు. వారి కోసం దేశమంతా ప్రార్థించే సమయమిదని పవన్ కళ్యాణ్ అన్నారు. శుక్రవారం ఈ మేరకు పవన్ కల్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు.
జనసేన పక్షాన మంగళవారం ఉదయం షష్ట షణ్ముఖ క్షేత్రాలైన తిరుత్తణి, తిరుచెందూరు, పళని, తిరుపరంకుండ్రమ్, స్వామిమలై, పలముదిరచోళై క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు చేయించాలని నిర్ణయించామని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి క్షేత్రానికి ఒక శాసన సభ్యుడు, జన సైనికులను పంపించి పూజలు చేయిస్తామని చెప్పారు. కర్ణాటకలోని కుక్కే, ఘాటీ సుబ్రహ్మణ్య క్షేత్రాలు, ఆంధ్రప్రదేశ్ లోని మోపిదేవి, బిక్కవోలులోని సుబ్రహ్మణ్య ఆలయాలు, ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర ఆలయం, పిఠాపురం శ్రీ పురూహూతిక దేవి ఆలయాల్లో పూజలు చేయిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు.
ఈ ఆదివారం శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలోని శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో సైన్యానికి సూర్య శక్తి తోడుండేలా పూజలు చేస్తునట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. వీటితోపాటు రాష్ట్రంలోని వివిధ క్షేత్రాల్లోనూ సైన్యం కోసం, యుద్ధ ప్రభావం ఉన్న జమ్ము, కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, హరియాణ రాష్ట్రాల ప్రజల క్షేమాన్ని కోరుతూ పూజలు చేయాలని అన్నారు. క్రైస్తవ ధర్మాన్ని విశ్వసించేవారు చర్చిల్లో, ఇస్లాం ధర్మాన్ని ఆచరించేవారు మసీదుల్లో ప్రార్థనలు చేపడతారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.