PM Modi : మొన్న ది కాశ్మీర్ ఫైల్స్ వివాదాస్పదంగా మారితే తాజాగా ది కేరళ స్టోరీ చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మూవీ గురించి ప్రస్తావించడం కలకలం రేపింది. నెట్టింట్లో ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ది కేరళ స్టోరీని ఉదహరిస్తూ తీవ్రవాద మైండ్ సెట్ కు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తోందని ఆరోపించారు. పీఎం తన ప్రసంగం పొడవునా కాంగ్రెస్ పై నిందారోపణలు చేస్తూనే ఉన్నారు. పార్టీ తీవ్రవాదం పట్ల మృదువుగా వ్యవహరిస్తోందంటూ ఆరోపించారు. తీవ్రవాద మద్దతుదారులతో పార్టీ బలపడాలని చూస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు నరేంద్ర మోదీ(PM Modi).
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా బళ్లారిలో జరిగిన బహిరంగ సభలో ప్రధానమంత్రి కీలక ప్రసంగం చేశారు. కాంగ్రెస్ తన ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు ఉగ్రవాదం ముందు మోకరిల్లిందంటూ మండిపడ్డారు. తీవ్రవాద కుట్రపై ఆధారపడిన వివాదాస్పద చిత్రం ది కేరళ స్టోరీని కాంగ్రెస్ కావాలని వ్యతిరేకిస్తోందంటూ ధ్వజమెత్తారు.
ఈ సినిమాపై నిషేధం విధించడం ద్వారా ఉగ్రవాదాన్ని సమర్థిస్తున్న వారికి కాంగ్రెస్ మద్దతు ఇస్తోందన్నారు. బాంబులు, తుపాకులతో జాతిని ఉద్దరించాలని అనుకోవడం భ్రమ అని కొట్టి పారేశారు.
Also Read : డీకే శివకుమార్ సీఎం కాలేడు
