Political Leaders: విమాన ప్రమాదాల్లో మృతి చెందిన రాజకీయ, సినీ ప్రముఖులు
విమాన ప్రమాదాల్లో మృతి చెందిన రాజకీయ, సినీ ప్రముఖులు
Political Leaders : భారత్ లో ఇప్పటివరకు జరిగిన విమాన ప్రమాదాల్లో ఎంతోమంది ప్రముఖులు ప్రాణాలు(Political Leaders) కోల్పోయారు. తాజాగా గురువారం గుజరాత్లోని అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణీ(Vijay Rupani) మరణించారు. లండన్ లో ఉంటున్న తన కుమార్తెను చూసేందుకు బయలుదేరిన విజయ్ రూపానీ(Vijay Rupani)… ఈ ప్రమాదంలో మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు విమాన ప్రమాదాల్లో మృతిచెందిన పలువురు రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖుల వివరాలు..
Political Leaders – పైలట్ల తప్పిదంతో హోమీ బాబా మృతి
భారత అణు కార్యక్రమ పితామహుడు, విశ్వవిఖ్యాత అణు భౌతిక శాస్త్రవేత్త హోమీ జహంగీర్ బాబా ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియామ101 విమానం 1966 జనవరి 24న స్విట్జర్లాండ్లోని స్విస్ ఆల్ప్స్ పర్వతాల్లో ఉన్న మోంట్ బ్లాంక్ శిఖరంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆయన మరణించారు. స్విట్జర్లాండ్ లోని జెనీవాలో ఉన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) విభాగంతో విమాన పైలట్లు సరిగ్గా కమ్యూనికేట్ చేసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అనంతరం చేపట్టిన దర్యాప్తులో వెల్లడైంది.
ఏరోబాటిక్స్ చేస్తుండగా సంజయ్ గాంధీ మృతి
మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ(Sanjay Gandhi) కూడా విమాన ప్రమాదంలోనే చనిపోయారు. 1976లో ఆయనకు పైలట్ లైసెన్స్ వచ్చింది. 1980 జూన్ 23న ఢిల్లీలోని సఫ్దర్జంగ్ విమానాశ్రయం సమీపంలో ఢిల్లీ ఫ్లయింగ్ క్లబ్ కు చెందిన విమానంలో సంజయ్ గాంధీ ఏరోబాటిక్స్ చేస్తున్న క్రమంలో అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయారు. ఫలితంగా విమానం కూలడంతో సంజయ్ గాంధీ చనిపోయారు.
ప్రతికూల వాతావరణంతో కూలిన సింధియా విమానం
కాంగ్రెస్ సీనియర్ నేత మాధవ్రావ్ సింధియా గతంలో విమానయాన శాఖ మంత్రిగా సేవలు అందించారు. ఈయన కూడా విమాన ప్రమాదంలోనే ప్రాణాలు కోల్పోయారు. 2001 సెప్టెంబరు 30న ఉత్తరప్రదేశ్లోని కాన్పుర్లో జరిగే ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొనేందుకు మాధవ్రావ్ బయలుదేరారు. విమానం మార్గమధ్యలో ఉండగా వాతావరణం ప్రతికూలంగా మారింది. దీనితో 10 సీటర్ ప్రైవేటు విమానం ఉత్తరప్రదేశ్లోని మణిపురి సమీపంలో కూలిపోవడంతో ఆయన మరణించారు.
హెలికాప్టర్ కూలడంతో జీఎంసీ బాలయోగి మృతి
అప్పటి లోక్సభ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత జీఎంసీ బాలయోగి(GMC Balayogi) 2002 మార్చి 3న హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. ఆయన ఒక ప్రైవేటు హెలికాప్టర్ లో ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి బయలుదేరారు. కృష్ణా జిల్లా కైకలూరు సమీపంలో ఉన్న ఒక చెరువు వద్ద హెలికాప్టర్ కూలిపోవడంతో చనిపోయారు.
మేఘాలయలో కూలిన సైప్రియన్ సంగ్మా హెలికాప్టర్
ఆనాటి మేఘాలయ రాష్ట్ర మంత్రి సైప్రియన్ సంగ్మా, మరో 9 మంది పవన్ హాన్స్ హెలికాప్టర్ లో అస్సాంలోని గువాహటి నుంచి మేఘాలయలోని షిల్లాంగ్ కు బయలుదేరారు. షిల్లాంగ్ శివార్లలోని బారాపానీ సరస్సు సమీపంలో హెలికాప్టర్ కూలిపోయి మరణించారు. షిల్లాంగ్కు కేవలం 20 కిలోమీటర్ల దూరంలో 2004 సెప్టెంబరు 22న ఈ ప్రమాదం జరిగింది.
సింగిల్ ఇంజిన్ విమానం కూలడంతో ప్రముఖ నటి సౌందర్య మృతి
ప్రముఖ హీరోయిన్ సౌందర్య 2004 ఏప్రిల్ 17న జరిగిన గగనతల ప్రమాదంలో చనిపోయారు. సింగిల్ ఇంజిన్ కలిగిన సెస్నా-180 విమానంలో బెంగళూరులోని జక్కూర్ ఎయిర్ఫీల్డ్ నుంచి తెలంగాణలోని కరీంనగర్కు సౌందర్య బయలుదేరారు. ఈ విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే కూలిపోయింది. దీనితో అందులోని సౌందర్య సహా నలుగురు ప్రయాణికులు చనిపోయారు. ఆ సమయానికి సౌందర్య వయసు 32 ఏళ్లు. ఆమె గర్భిణిగా ఉన్నారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త ఓం ప్రకాశ్ జిందాల్ కూడా
విమాన ప్రమాదంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఓం ప్రకాశ్ జిందాల్(Om Prakash Zindal) మరణించారు. అప్పట్లో హరియాణా రాష్ట్ర మంత్రిగా ఉన్న ఆయన, 2005 మార్చి 31న మరో మంత్రి సురీందర్ సింగ్తో కలిసి హెలికాప్టర్లో ఢిల్లీ నుంచి చండీగఢ్ కు బయలుదేరారు. ఉత్తర్ప్రదేశ్లోని సహారన్పుర్ సమీపంలో ఈ హెలికాప్టర్ కూలింది. ఈ ప్రమాదంలో ఓం ప్రకాశ్ జిందాల్, సురీందర్ సింగ్ చనిపోయారు.
నల్లమల అడవుల్లో ఏపీ సీఎం వైఎస్సార్ మృతి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్(AP) రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి(YS Rajasekhar Reddy) హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. 2009 సెప్టెంబరు 2న బెల్ 430 హెలికాప్టర్ లో రచ్చబండ కార్యక్రమానికి ఆయన బయలుదేరారు. ఈ హెలికాప్టర్ నల్లమల అడవుల్లోకి ప్రవేశించగానే వాతావరణం ప్రతికూలంగా మారింది. దీనితో హెలికాప్టర్ అదుపుతప్పి అడవుల్లోనే కుప్పకూలింది. వైఎస్సార్ మృతదేహాన్ని గుర్తించడానికి సుఖోయ్ వంటి యుద్ద విమానాలను ఉపయోగించి రెండు రోజుల తరువాత కొన్ని మాంసపు ముద్దలను గుర్తించిన విషయం తెలిసిందే.
వెస్ట్ కామెంగ్ జిల్లాలో అరుణాచల్ప్రదేశ్ సీఎం దోర్జీ ఖండు మృతి
2011 ఏప్రిల్ 30న అప్పటి అరుణాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రి దోర్జీ ఖండు, మరో నలుగురు హెలికాప్టర్ లో తవాంగ్ నుంచి ఇటానగర్కు బయలుదేరారు. రాష్ట్రంలోని వెస్ట్ కామెంగ్ జిల్లాలోకి ప్రవేశించగానే హెలికాప్టర్ అదుపుతప్పి కూలిపోయింది. దీనితో అందులోని వారంతా చనిపోయారు.
ఊటీ కొండల్లో సీడీఎస్ బిపిన్ రావత్ మృతి
దేశ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ 2021 డిసెంబరు 8న హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. బిపిన్ రావత్, ఆయన భార్య, మరో 11 మంది హెలికాప్టర్లో తమిళనాడులోని సూలూర్ నుంచి వెల్లింగ్టన్కు బయలుదేరారు. అనంతరం తమిళనాడులోని కూనూర్ సమీపంలో హెలికాప్టర్ కూలిపోయింది. దీనితో అందులో ప్రయాణిస్తున్న వారంతా ప్రాణాలు కోల్పోయారు.
Also Read : Air India Plane Crash: ఎయిరిండియా విమాన ప్రమాదంలో 274కు చేరిన మృతులు