జ‌నాభా భారం కాదు అభివృద్దికి సోపానం

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన సీఎం చంద్ర‌బాబు

అమరావతి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మ‌రోసారి జ‌నాభా గురించి ప్ర‌స్తావించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా జనాభా పెరుగుదల భారం కాదని, రాష్ట్రానికి భాగ్యం అవుతుందని స్ప‌ష్టం చేశారు. ఇన్నాళ్లూ ఫ్యామిలీ ప్లానింగ్‌కి ప్రాధాన్యత ఇచ్చామని, ఇకపై ‘పాపులేషన్ కేర్’ పై దృష్టి పెట్టనున్నట్టు తెలిపారు. దేశంలోనే తొలిసారి రాష్ట్రంలో పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ తీసుకువస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రక‌టించారు. జనాభా నిర్వహణ పై డ్రాఫ్ట్ పాలసీపై శాసనసభలో ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. ఏపీలో ప్రస్తుతం టోటల్ ఫెర్టిలిటీ రేటు (టీఎఫ్ఆర్) 1.5గా ఉందని, దీనిని 2.1కి పెంచడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. జపాన్, దక్షిణ కొరియా, ఇటలీ వంటి దేశాల్లో ఫెర్టిలిటీ రేట్ తగ్గుతోందని, భారతదేశంలోనూ ముఖ్యంగా ఏపీలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొందని సీఎం అన్నారు.

1992-93లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీఎఫ్ఆర్ 3.0గా ఉండేదని గుర్తు చేశారు. టీఎఫ్ఆర్ మరింత వేగంగా తగ్గితే వర్క్ ఫోర్స్ పడిపోతుందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు నారా చంద్ర‌బాబు నాయుడు. దీంతో ఆర్థిక వృద్ధి మందగిస్తుందని చెప్పారు. ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే మరింత నష్టం వాటిల్లుతుందనే ఆలోచనతో ఈ డ్రాఫ్ట్ పాలసీకి రూపకల్పన చేశామని వివరించారు. 2023 లెక్కల ప్రకారం రాష్ట్రంలో కేవలం ఏడాదికి 6.70 లక్షల జననాలు మాత్రమే ఉన్నాయన్నారు సీఎం. ఇది ఇలాగే కొనసాగితే 2047 నాటికి రాష్ట్ర జనాభాలో 23 శాతం మంది వృద్ధులే ఉంటారని చెప్పారు. ‘పాపులేషన్ మేనేజ్‌మెంట్’ పాలసీ డాక్యుమెంట్ అందరికీ అందుబాటులో ఉండేలా ఆన్‌లైన్‌లో పెడుతున్నట్టు సీఎం ప్రకటించారు. దీనిపై రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గంలో నెల రోజుల పాటు ప్రజా ప్రతినిధులు ప్రజల్లో ఈ అంశంపై చర్చ నిర్వహించాలని ముఖ్యమంత్రి సూచించారు.

Leave A Reply

Your Email Id will not be published!