హైదరాబాద్ : తెలంగాణలో రాజకీయాలు మరింత వేడిని పుట్టిస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురై , ఆ పార్టీ తరపున ఎన్నికైన శాసన మండలి సభ్యురాలి పదవికి రాజీనామా చేసి సంచలనంగా మారిన తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చర్చనీయాంశంగా మారారు. ఇవాళ తాను ఏర్పాటు చేసిన కమిటీలతో హైదరాబాద్ లోని తన కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా భారత దేశంలో అత్యంత పేరు పొందిన ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ తో సమావేశాలు జరిపారని, ఇందు కోసం తన సంస్థను పార్టీగా మార్చే యోచనలో కల్వకుంట్ల కవిత ఉన్నట్లు సమాచారం . ఈ మేరకు ఇద్దరి మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయని, అవి ఫలప్రదం అయ్యాయని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
రాష్ట్రంలో రాబోయే ఎన్నికల లోపు తాను పవర్ సెంటర్ కావాలని డిసైడ్ అయ్యారు కవిత. ఇందులో భాగంగానే ఆమె అయిన వారిని, కన్న వారిని, కుటుంబీకులను , బంధాలను సైతం వదులుకుంది. అంతే కాకుండా శాసన మండలిలో సంచలన ఆరోపణలు చేశారు పార్టీని, తన తండ్రిని కూడా. ఈ క్రమంలో తాను సీరియస్ గా పాలిటిక్స్ చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. కవిత ఇటీవల ఐదు రోజుల పాటు హైదరాబాద్లో ఉన్నప్పుడు కిషోర్తో చర్చలు జరిపినట్లు టాక్. బీఆర్ఎస్ పాలనలో నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం విషయంలో తన తండ్రి ప్రతిష్టను తన బంధువులు, నాయకులైన టి హరీష్ రావు , జె సంతోష్ కుమార్ కళంకం తెచ్చేలా ప్రయత్నం చేశారని ఆరోపించారు. మొత్తం మీద కవిత ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారారు.
