PSR Anjaneyulu: ఏపీ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు అరెస్ట్

ఏపీ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు అరెస్ట్

 

 

ఐపీఎస్‌ అధికారి, ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులును ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేసారు. ముంబయి నటి జత్వానీకి వేధింపుల కేసులో ఏపీ సీఐడీ అధికారులు ఆయన్ను హైదరాబాద్‌ లో అరెస్ట్‌ చేసి విజయవాడ సీఐడీ కార్యాలయానికి తరలించారు. అనంతరం అక్కడే ఆయన్ను విచారించారు. రేపు అంటే బుధవారం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

 

ముంబయి నటి కాదంబరీ జత్వాని ఫిర్యాదు కేసులో పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు రెండో నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే విజయవాడ మాజీ సీపీ కాంతిరాణా తాతా, ఐపీఎస్‌ అధికారి విశాల్‌ గున్నీ సస్పెండ్‌ అయ్యారు. జత్వానీ వ్యవహారంలో వైసీపీ ముఖ్యనేత ఆదేశాల మేరకు అప్పటి మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు రంగంలోకి దిగారు. ఆమెపై ఏ కేసు పెట్టాలి… ఎలా అరెస్ట్‌ చేయాలనే విషయాలను అన్నీ తానై చూసుకున్నారు. ప్రణాళిక సిద్ధం కాగానే వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌ ను పిలిపించి జత్వానీకి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయించారు. తన ఆస్తిపై ఆమె తప్పుడు ఒప్పంద పత్రాల్ని సృష్టించి ఇతరులకు విక్రయించినట్లు ఇబ్రహీంపట్నంలో విద్యాసాగర్‌ ఫిర్యాదు చేశాడు.

 

ఆ తప్పుడు ఫిర్యాదు ఆధారంగా జత్వానీ, ఆమె తల్లిదండ్రులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ముంబయి వెళ్లి జత్వానీ, ఆమె తల్లిదండ్రులను అరెస్ట్‌ చేసి విజయవాడకు తరలించడం… రిమాండ్‌కు పంపడం తదితర వ్యవహారాలను కాంతిరాణా, విశాల్‌ గున్నీ పర్యవేక్షించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీ హయాంలో అధికారులు తమపట్ల వ్యవహరించిన తీరుపై జత్వానీ ఫిర్యాదు చేశారు. తప్పుడు కేసుతో తీవ్రంగా వేధించారని పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదుతో విద్యాసాగర్‌తో పాటు పీఎస్‌ ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్‌గున్నీలపై కేసు నమోదు చేశారు.

 

 

ముగిసిన పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు విచారణ

ఏపీ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు సీఐడీ విచారణ ముగిసింది. ముంబయి నటి జత్వానీ కేసులో మంగళవారం ఉదయం ఆయన్ను అరెస్ట్‌ చేసి… పలు కీలక పత్రాలను పోలీసులు సేకరించారు. జత్వానీ కేసు వ్యవహారంలో విజయవాడలోని సీఐడీ కార్యాలయంలో ఆయన్ని లోతుగా విచారించారు. ఉదయం నుంచి 7 గంటలపాటు సీఐడీ అధికారుల విచారణ కొనసాగింది. బుధవారం ఉదయం వరకు ఆయన్ని అక్కడే ఉంచి, కోర్టులో హాజరుపరచనున్నారు. మరోవైపు పీఎస్‌ఆర్‌ ఆంజనేయులపై మరో కేసు కూడా నమోదైంది. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఉన్న కేఆర్‌ సూర్యనారాయణను తుపాకీతో బెదిరించారంటూ గుంటూరు సీఐడీ పీఎస్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు.

Leave A Reply

Your Email Id will not be published!