Rahul Gandhi: సాఫ్ట్వేర్ తో ఓటర్ ఐడీలను తొలగిస్తున్నారు – రాహుల్ గాంధీ ఆరోపణ
సాఫ్ట్వేర్ తో ఓటర్ ఐడీలను తొలగిస్తున్నారు - రాహుల్ గాంధీ ఆరోపణ
Rahul Gandhi: కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ (Congress) పార్టీకి పట్టున్న ప్రాంతాల నుంచి ఓట్లను తొలగించారని విమర్శించారు. రాష్ట్రం వెలుపలి నుంచి నకిలీ లాగిన్లు, ఫోన్ నంబర్లను ఉపయోగించి ఓటర్ ఐడీలను తొలగించినట్లు వ్యాఖ్యానించారు. సాఫ్ట్వేర్ను వినియోగించి కేంద్రీకృత పద్ధతిలో ఈ చర్యలకు పాల్పడినట్లు ఆరోపించారు. ఈ మేరకు దిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు.
‘‘ఈ ఓట్ల తొలగింపు అంతా వ్యక్తులతో గాకుండా సాఫ్ట్వేర్ను ఉపయోగించి చేస్తున్నారు. అదంతా ఒక ప్రక్రియ ప్రకారం జరుగుతోంది. ప్రతిపక్షాలకు ఓట్లు వేసే కమ్యూనిటీలను మరీ ముఖ్యంగా లక్ష్యంగా చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి మేం 100 శాతం ఆధారాలను గుర్తించాం. నేను ఈ దేశాన్ని, రాజ్యాంగాన్ని ప్రేమిస్తున్నాను. ఈ ప్రజాస్వామ్య ప్రక్రియను ఇష్టపడతాను. ఈ ప్రక్రియను నేను రక్షిస్తున్నాను. ఇక దీనికి ఎలా స్పందించాలనేది మీ చేతుల్లోనే ఉంటుంది. కర్ణాటకలోని అలంద్లో ఆరువేల ఓట్లను తొలగించే ప్రయత్నం జరిగింది’’ అని విమర్శించారు.
Rahul Gandhi – 100 శాతం ఆధారాలున్నాయి
ఓట్ల చోరీ గురించి ఈసీ నుంచి మాకు సమాచారం వస్తోంది. చాలా చోట్ల మైనారిటీలు, ఆదివాసీల ఓట్లను తొలగిస్తున్నారు. ఇప్పటికే ఉద్దేశపూర్వకంగానే లక్షల ఓట్లను తొలగించారు. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లోనూ పెద్ద ఎత్తున ఓట్లు తొలగించారు. కర్ణాటక ఓటర్లకు లింక్ చేసిన ఫోన్ నెంబర్లన్నీ తప్పుడువే. కాంగ్రెస్కు బలమున్న ప్రాంతాల్లోనే ఓట్ల తొలగింపు జరిగింది. ఓట్లను తొలగించేందుకు కొందరు వ్యవస్థను హైజాక్ చేస్తున్నారు. ఫేక్ లాగిన్తో కాంగ్రెస్ సానుభూతి ఓట్లను తొలగించారు. ఇవన్నీ ఆరోపణలు కాదు.. పక్కా ఆధారాలతో చెబుతున్నా.. అని రాహుల్ అన్నారు.
Rahul Gandhi – సీఈసీపై రాహుల్ సంచలన ఆరోపణలు
ఎన్నికల సంఘం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నవారిని కాపాడుతోంది. అధికారులకు తెలియకుండా జాబితా నుంచి ఓట్లు ఎలా పోతాయి?. కేవలం కాంగ్రెస్ ఓటర్లే టార్గెట్గా ఇదంతా నడుస్తోంది. కర్ణాటక సీఐడీ ఓట్ల తొలగింపు వివరాలు 18సార్లు అడిగినా ఈసీ స్పందించడం లేదు. మాకు ఓట్ల తొలగింపు ఐడీల వివరాలు, ఓటీపీలు కావాలి. వారం లోగా సీఐడీ అడిగిన వివరాలు అందించాలి.
కర్ణాటక అలంద్లో గోదాబాయ్ పేరుతో 18 ఓట్లు తొలగించారు . మహారాష్ట్ర రాజురా నియోజకవర్గంలో 6,851 ఫేక్ ఓట్లు కలిపారు. కర్ణాటక, యూపీ, మహారాష్ట్ర, హర్యానాలో ఒకే రీతిలో ఓట్ల తొలగింపు జరిగింది. సెంట్రలైజ్డ్ వ్యవస్థ ద్వారా పథకం ప్రకారం రాష్ట్ర ఎన్నికల్లో ఓట్లు డిలీట్ చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే వ్యవస్థ ఆ పని చేయడం లేదు. ఓట్ల దొంగలను సీఈసీ రక్షిస్తోంది. అందుకే ప్రతిపక్ష నేతగా నేను ప్రజల ముందు ఉంచుతున్నా. ఓటు చోరీ అనేది ప్రజాస్వామ్యంపై అణుబాంబ్ లాంటిది. కానీ ఇప్పుడు హైడ్రోజన్ బాంబ్ పేలబోతోంది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నవాళ్లను ఈసీ కాపాడుతోంది. ఓట్లు చోరీ చేస్తున్న వారిని సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రక్షిస్తున్నారు. అన్నింటికీ మా దగ్గర ఆధారాలన్నాయ్. ఎన్నికల వ్యవస్థలో అక్రమాలను కోర్టులు పరిశీలించాలి. ఓట్ల చోరీపై న్యాయ వ్యవస్థ దృష్టి సారించాలి అని రాహుల్ గాంధీ కోరారు. ఈ క్రమంలో ఆధారాల పేరిట పలువురు ఓటర్లతో మాట్లాడించిన ఆయన, ఓట్ల అవకతవకల పేరిట జరిగిన అంశాలనూ మీడియా ముందు ప్రవేశపెట్టారు.
Also Read : Samir Modi: అత్యాచారం కేసులో లలిత్ మోదీ సోదరుడు అరెస్టు
