Rajballabh Yadav : తేజస్వీ భార్యపై నోరుపారేసుకున్న ఆర్జేడీ మాజీ నేత
తేజస్వీ భార్యపై నోరుపారేసుకున్న ఆర్జేడీ మాజీ నేత
Rajballabh Yadav : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో బిహార్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు నేతలు వ్యక్తిగత దూషణలు, ఆరోపణలు చేస్తూ నోరుజారుతున్నారు. తాజాగా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ భార్యపై ఆ పార్టీ మాజీ నేత రాజ్బల్లభ్ యాదవ్ (Rajballabh Yadav) వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సంచలనమైంది. రాజ్బల్లభ్ ఇటీవలే జైలు నుంచి విడుదలయ్యారు. రాష్ట్రం బయట అమ్మాయిని తేజస్వి యాదవ్ ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని ప్రశ్నిస్తూ రాజ్బల్లభ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
‘ఓట్ల కోసమే వాళ్లు కులాన్ని ఉపయోగించుకుంటారు. వివాహానికి వచ్చేసరికి వాళ్లు ఎక్కడ పెళ్లి చేసుకున్నారు ? హర్యానాలోనో, పంజాబ్లోనే పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది?. ఆయన మహిళను తెచ్చుకున్నారా… జెర్సీ ఆవునా?. ఇక్కడ అమ్మాయిలు లేరా?’ అని ప్రశ్నించారు. నవడా జడిల్లా నర్దిగంజ్లో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియా ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
మైనర్ బాలికపై అత్యాచారం కేసులో తొమ్మిదిన్నరేళ్లు జైలులో ఉన్న రాజ్బల్లభ్ యాదవ్.. గత నెలలో పాట్నా హైకోర్టు నిర్దోషిగా ప్రకటించడంతో విడుదలయ్యారు. కాగా, తేజస్వి యాదవ్ తన స్కూల్మేట్ రాచెల్ గోడిన్హోను 2021లో పెళ్లి చేసుకున్నారు. వివాహానంతరం ఆమె రాజశ్రీ యాదవ్గా పేరుమార్చుకున్నారు. అయితే, బిహార్ ఎన్నికల వేళ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
Rajballabh Yadav – రాజ్బల్లభ్ వ్యాఖ్యలపై మండిపడిన ఆర్జేడీ
రాజ్బల్లభ్ వ్యాఖ్యలపై ఆర్జేడీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆయన వ్యాఖ్యలు కేవలం రాజశ్రీ యాదవ్పై జరిగిన దాడి కాదని, వెనుకబడిన, దళిత వర్గాల గౌరవంపై జరిపిన దాడి అని అన్నారు.
Also Read : Uttar Pradesh: 37 ఏళ్లుగా నెలకు రూ.750 జీతం తీసుకుంటున్న ఉద్యోగులు
