Rajya Sabha MP Resign: వైసీపీ కీ ఇద్దరు ఎంపీలు అవుట్‌ !

వైసీపీ కీ ఇద్దరు ఎంపీలు అవుట్‌!

Rajya Sabha MP: సార్వత్రిక ఎన్నికల్లో ఘోరపరాజయం నుంచి ఇప్పటికీ కోలుకోని వైసీపీ(YCP) అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి బిగ్ షాక్‌ తగిలింది. ఆ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ(Rajya Sabha MP)లు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు తమ పదవులకు రాజీనామా చేశా రు. ఈ మేరకు గురువారం రాజ్యసభ చైర్మన్‌, ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ను కలిసి రాజీనామా లేఖలు అందజేశారు. ఆయన అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ.. మనస్సాక్షిగానే ఎంపీ పదవులకు రాజీనామా చేస్తున్నామని వెల్లడించారు.

Rajya Sabha MP Resign..

వారి రాజీనామాలను ధన్‌ఖడ్‌ తక్షణమే ఆమోదించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌ వేదికగా స్పందించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 101 3.B, రాజ్యసభ రూల్స్‌ ఆఫ్‌ ప్రొసీజర్‌ అండ్‌ కండక్ట్‌ బిజినెస్‌ రూల్‌ 213 ప్రకారం మోపిదేవి, బీద మస్తాన్‌రావు రాజీనామాలను ఆమోదించినట్లు ప్రకటించారు. ఖాళీ అయిన రాజ్యసభ స్థానాల ఉప ఎన్నికకు 10 రోజుల్లో ఎన్నికల కమిషన్‌ ఈసీ నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశముందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇంకోవైపు.. రాజీనామాలు సమర్పించాక మోపిదేవి, మస్తాన్‌రావు మీడియాతో మాట్లాడారు.

స్వచ్ఛందంగానే ఎంపీ(Rajya Sabha MP) పదవులకు రాజీనామా చేశామని, వెనుక ఎవరి ప్రలోభాలూ లేవని స్పష్టంచేశారు. వైసీపీ అధినేత జగన్‌ తనకు 100శాతం సహకరించారని.. అయితే కొన్ని సందర్భాలు, అంశాల్లో ఆయనతో విభేదాలు వచ్చాయని, అందువల్లే పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చానని మోపిదేవి చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తనను పరిగణనలోకి తీసుకోకుండా స్థాయి లేని వ్యక్తికి టికెట్‌ ఇచ్చారని, అప్పుడే పార్టీ మారాలని అనుకున్నానని తెలిపారు. రేపల్లె ప్రజలకు అందుబాటులో ఉండడం తనకిష్టమన్నారు. గౌరవ మర్యాదలు, పరువు ప్రతిష్ఠల గురించి ఎవరి వద్దో నేర్చుకోవలసిన అవసరం నాకు లేదు. గడచిన 40 ఏళ్లలో గౌరవప్రదంగా ప్రజల్లోనే ఉండి రాజకీయాలు చేశాను. నేను టీడీపీలో చేరుతున్నాను. ఇందులో దాపరికమేమీ లేదు. రాజకీయాల్లో ఉన్నప్పుడు పార్టీలు మారడం సహజం. అసెంబ్లీ ఎన్నికల్లో నాకు కాకుండా మరొకరికి టికెట్‌ ఇచ్చినప్పుడు వైసీపీ కేడర్‌ వ్యతిరేకత వ్యక్తం చేసింది.

నాలుగేళ్లు పదవీకాలం ఉన్నా..

తనకు నాలుగేళ్లు పదవీకాలం ఉన్నప్పటికీ వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశామని బీద మస్తాన్‌రావు చెప్పారు. జాతీయ రాజకీయాలంటే తనకు ఆసక్తి అని, అవకాశం ఉంటే మళ్లీ రాజ్యసభకు వస్తానని తెలిపారు. టీడీపీలో చేరికపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. 32ఏళ్లు టీడీపీలో ఉన్నానని.. అప్పుడు చంద్రబాబు తన బాస్‌గా ఉండేవారని చెప్పారు. తనకు అవకాశం, గౌరవం ఇచ్చిన జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కుటుంబసభ్యులు, సన్నిహితులు, బంధువులతో చర్చించి తదుపరి కార్యచరణపై నిర్ణయం తీసుకుంటానన్నారు. వైసీపీ నాయకత్వం తనను ఆదరించినా ఆ పార్టీ జిల్లా నాయకత్వం నుంచి ఎదురవుతున్న అవమానాలను తట్టుకోలేక ఆయన వైసీపీకి, ఎంపీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ఆయన్ను బీజేపీలోకి తీసుకునేందుకు తమిళనాడుకు చెందిన ఆ పార్టీ నాయకులు, రాజ్యసభలోని ఆయన మిత్రులు విశ్వప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో టీడీపీ లోక్‌సభ ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆయన్ను తమ పార్టీలోకి ఆహ్వానించారు. ప్రముఖ వ్యాపారవేత్తగా స్థిరపడిన మస్తాన్‌రావు.. రెండున్నర దశాబ్దాల క్రితం టీడీపీ ద్వారానే రాజకీయ అరంగేట్రం చేశారు. 2009లో కావలి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 ఎన్నికల్లో నెల్లూరు లోక్‌సభ స్థానంలో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ప్రత్యేక పరిస్థితుల్లో వైసీపీలోకి వెళ్లారు.

Also Read:Pawan kalyan: పారదర్శక పాలనకు సాక్ష్యంగా జీఓఐఆర్‌ వెబ్‌సైట్‌ను పునరుద్ధరణ: డిప్యూటీ సీఎం పవన్‌

Leave A Reply

Your Email Id will not be published!