రాజస్థాన్ లో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఐసీయూలో చికిత్స పొందుతున్న ఓ మహిళపై అక్కడి నర్సింగ్ స్టాఫ్ అత్యాచారానికి పాల్పడ్డాడు. బుధవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…
అల్వార్లోని ఈఎస్ఐసీ మెడికల్ కాలేజీలో ఓ మహిళ (32) ఐసీయూలో చికిత్స పొందుతుండగా, ఆమె కుటుంబసభ్యులు వార్డు బయట వేచి ఉన్నారు. ఈ క్రమంలోనే నర్సింగ్ సిబ్బంది ఒకరు ఐసీయూలోకి వచ్చి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనికి ముందు ఆ మహిళ బెడ్ చుట్టూ కర్టెన్ లు వేసి బాధితురాలికి మత్తుమందు ఇచ్చాడు. ఈక్రమంలో బాధితురాలు కొంచెం స్పృహలో ఉండటంతో తన కుటుంబసభ్యులను పిలిచేందుకు ప్రయత్నించినప్పటికీ లాభం లేకుండా పోయింది. ఆమె స్పృహలోకి వచ్చాక కుటుంబసభ్యులకు జరిగిన విషయం తెలియజేసింది.
బాధితురాలి భర్త ఆస్పత్రి సిబ్బందిని నిలదీయగా… వారు దాన్ని ఖండించారు. ఆ వెంటనే దీనిపై కేసు నమోదు చేశారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించిన అధికారులు ఆమె వాంగ్మూలం కూడా రికార్డు చేశారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇక, ఈ ఘటనపై విచారణ కమిటీని ఏర్పాటుచేస్తామని ఆస్పత్రి అధికారి ఒకరు పేర్కొన్నారు. తప్పు చేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.