Sabitha Indra Reddy: అసెంబ్లీ సమావేశాల్లో మాజీ మంత్రి సబిత కంటతడి

అసెంబ్లీ సమావేశాల్లో మాజీ మంత్రి సబిత కంటతడి

Sabitha Indra Reddy: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూ ఉంది. సభ ప్రారంభం కాగానే… ద్రవ్య వినిమయ బిల్లును డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టగా… అది కాస్త ఎక్కడెక్కడికో పోయింది. మొదట… మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులుగా సుమారు గంటకుపైగానే సభ నడవగా ఆ తర్వాత ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి(Sabitha Indra Reddy) ప్రస్తావన వచ్చింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఇద్దరూ కౌంటర్ల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క బీఆర్ఎస్ పై ఘాటు విమర్శలు చేశారు. కాంగ్రెస్‌ లోకి వచ్చిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నేతలు గవర్నర్‌ కు ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. ఆ ఫిర్యాదు పత్రాన్ని కాంగ్రెస్‌ లో గెలిచి బీఆర్ఎస్ లోకి వచ్చిన సబితా ఇంద్రారెడ్డితో ఇప్పించారని ఎద్దేవా చేశారు.

ఈ క్రమంలో సబితా ఇంద్రారెడ్డి(Sabitha Indra Reddy) స్పందించారు. సీఎం రేవంత్‌ రెడ్డి ఎందుకు తనను టార్గెట్‌ చేస్తున్నారని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డిని.. ఓ అక్కగా కాంగ్రెస్‌లోకి సంతోషంగా ఆహ్వానించినట్లు గుర్తుచేశారు. ‘‘రేవంత్‌రెడ్డికి నాపై ఎందుకు కక్ష?. ఆరోజు పార్టీలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్‌ ఆశాకిరణం అవుతావని చెప్పాను. సీఎం అవుతావని కూడా చెప్పాను. మనస్ఫూర్తిగా ఆశీర్వదించాను’’ అని తెలిపారు.

సబిత వ్యాఖ్యలపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందిస్తూ… ‘‘సబితక్క నన్ను పార్టీలోకి ఆహ్వానించిన మాట వాస్తవం. వ్యక్తిగతంగా జరిగిన సంభాషణ సభలో చెప్పారు. సబిత సభలో ప్రస్తావించారు కాబట్టే… అప్పుడు జరిగిన పరిణామాలు సభలో చెప్పాలి. 2019లో మల్కాజిగిరిలో పోటీ చేయాలని కాంగ్రెస్‌ పార్టీ కోరింది. మల్కాజిగిరి నుంచి పోటీ చేస్తే అండగా ఉంటానని సబితక్క మాట ఇచ్చారు. కాంగ్రెస్‌ నన్ను అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే ఆమె బీఆర్ఎస్ లో చేరారు. అధికారం కోసం కాంగ్రెస్‌ ను వదిలి బీఆర్ఎస్ లో చేరి మంత్రి పదవి తీసుకున్నారు. తమ్ముడిగా నన్ను మోసం చేశారు కాబట్టే ఆమెను నమ్మవద్దని కేటీఆర్‌కు చెప్పా. మల్కాజిగిరి నుంచి పోటీ చేస్తే గెలిపించే బాధ్యత నాదే అని సబితా ఇంద్రారెడ్డి(Sabitha Indra Reddy) చెప్పారు. నేను చెప్పింది నిజమో.. కాదో.. సబితక్క గుండె మీద చేయి వేసుకుని చెప్పాలి’’ అని రేవంత్‌ చెప్పారు.

దీనితో సీఎం రేవంత్… ‘నన్ను ఎందుకు టార్గెట్ చేశారు’ అంటూ అసెంబ్లీలో సబిత కంటతడి పెట్టారు. ‘అక్కడ ఉన్న వారు (కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చూపిస్తూ..) ఏ పార్టీ నుంచి ఏ పార్టీలో చేరారో చర్చిద్దాం. నన్ను ఎందుకు టార్గెట్ చేశారు..?. నేను ఏం మోసం చేశాను..? ఎవరిని ముంచాను..?. రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని ఆహ్వానించింది నేనే. లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదని మాట్లాడితే, నన్ను టార్గెట్ చేశారు’ అని సబితా ఇంద్రారెడ్డి(Sabitha Indra Reddy) మాట్లాడారు. ఈ క్రమంలోనే స్పీకర్ కలుగజేసుకుని సభా నాయకుడిని అగౌరవ పరుస్తున్నారని సబితకు తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క మాట్లాడుతూ కాంగ్రెస్‌లో సబితా అనుభవించిన పదవులు మొత్తం అన్నీ ప్రస్తావించారు. ఈ క్రమంలో ఎమోషనల్‌‌కు లోనైన సబిత.. కంటతడి పెట్టారు.

‘2004 నుంచి 2009 వరకు కాంగ్రెస్ పార్టీ సబితా ఇంద్రారెడ్డికి అనేక పదవులు ఇచ్చింది. కానీ.. సబితా ఇంద్రారెడ్డి పార్టీని వీడి బీఆర్ఎస్‌లో చేరి మోసం చేశారు. ఒక దశాబ్ద కాలం సబితకి మంత్రి పదవి ఇచ్చాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుంటే సబిత బీఆర్ఎస్‌లోకి వెళ్ళారు. కాంగ్రెస్ నన్ను సీఎల్పీ లీడర్ చేస్తే నా వెనక ఉండాల్సింది పోయి పదవి కోసం సబిత పార్టీ మారారు. ప్రతిపక్ష నేత హోదా లేకుండా చేసేందుకు సబిత పార్టీ పదవి వెళ్లారు. పార్టీలు మారి, ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది గాక ఇప్పుడు ఏదో మాట్లాడుతున్నారు. అసలు సబిత ఎందుకు బాధపడుతున్నారో అర్థం కావడం లేదు’ అని భట్టీ ప్రశ్నలు, అంతకుమించి విమర్శల వర్షం కురిపించారు.

Sabitha Indra Reddy – ఇదేందక్కా..!

భట్టీ విక్రమార్క మాట్లాడిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘ ప్రసంగం చేశారు. సబితా ఇంద్రారెడ్డి(Sabitha Indra Reddy)ని సబితక్కా అని సంబోదిస్తూనే ప్రశ్నల వర్షం కురిపించారు. ‘ప్రజా జీవితంలో ఉన్నప్పుడు చర్చ ఉంటుంది. వ్యక్తిగతంగా జరిగిన చర్చను సబితక్క సభలో పెట్టారు. నువ్వు కాంగ్రెస్‌లోకి వస్తే ముఖ్యమంత్రిని అవుతానని సబితక్క నాకు చెప్పారు. మల్కాజ్‌గిరి పార్లమెంట్ నుంచి పోటీ చేయమని నాకు సబితక్క చెప్పి ఆమె మాత్రం టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళారు. నన్ను మోసం చేసిన సబితక్కతో జాగ్రత్తగా ఉండాలని నేను చెప్పాను. నేను చెప్పే మాట నిజమా..? కాదా..? అని సబితక్క గుండెపై చేయి వేసుకొని చెప్పాలి’ అని రేవంత్ గట్టిగానే మాట్లాడారు. ప్రసంగం ముగించిన రేవంత్.. కొత్త గవర్నర్‌ను రిసీవ్ చేసుకొని తిరిగొచ్చి మిగిలిన విషయాలు, మిగిలిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెబుతానని బయటికెళ్లారు.

Also Read : Minister Atishi: ఢిల్లీ కోచింగ్‌ సెంటర్ల నియంత్రణకు ప్రత్యేక చట్టం తీసుకొస్తాం – మంత్రి అతిశీ

Leave A Reply

Your Email Id will not be published!