Shahabuddin Razvi: టీమిండియా బౌలర్ షమీ పై ముస్లిం మతపెద్ద సంచలన వ్యాఖ్యలు !
టీమిండియా బౌలర్ షమీ పై ముస్లిం మతపెద్ద సంచలన వ్యాఖ్యలు !
Shahabuddin Razvi : టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీపై ఆల్ ఇండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు మౌలానా షహబుద్దీన్ రజ్వీ బరెల్వీ(Shahabuddin Razvi) సంచలన వ్యాఖ్యలు చేశాడు. పవిత్ర రంజాన్ మాసంలో షమీ పెద్ద నేరం చేశాడని ఆరోపించాడు. షమీ ఓ క్రిమినల్ అని సంభోదించాడు. మహమ్మద్ షమీ రంజాన్ నెలలో ఉద్దేశపూర్వకంగా రోజా (ఉపవాసం)ను వదిలేయడం ద్వారా మహా పాపానికి ఒడిగట్టారని షహబుద్దీన్ రజ్వీ ఆరోపించారు. చాంపియన్స్ ట్రోపీలో భాగంగా మార్చి 4న ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ సందర్భంగా మైదానంలో షమీ(Shami) కూల్ డ్రింక్ తాగడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఇస్లాంలో రోజా అనేది ఓ బాధ్యత అని… మ్యాచ్ సందర్భంగా ఉపవాసాన్ని విడిచిపెట్టడం ద్వారా షమీ(Shami) నేరానికి పాల్పడ్డారని మండిపడ్డారు. షమీ చర్య ఇస్లాం నిర్దేశించిన సూత్రాలకు వ్యతిరేకం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘రోజాను కొనసాగించకుండా వదిలేసిన షమీ ఓ నేరగాడు. తన చర్యలపై ఆయన దేవుడికి కచ్చితంగా సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది’ అని షహబుద్దీన్ వ్యాఖ్యానించారు. అయితే షమీకి ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఎగ్జిక్యూటివ్ మెంబర్ మౌలానా ఖలీద్ రషీద్ ఫరంగీ మహ్లీ మద్దతుగా నిలిచారు. క్రికెటర్ షమీ ప్రస్తుతం పర్యటనలో ఉన్నారని… ప్రయాణాల్లో ఉన్నవారికి రోజా నుంచి వైదొలిగేందుకు మినహాయింపు ఉంటుందన్నారు. ఇక షమీకి పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా మద్దతు పలికారు.
Shahabuddin Razvi – అసలేం జరిగిందంటే ?
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 తొలి సెమీఫైనల్లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడ్డాయి. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ సందర్భంగా షమీ ఎనర్జీ డ్రింక్ తాగుతూ కనిపించాడు. దీనిపై ముస్లిం మత పెద్ద రజ్వీ తీవ్రంగా స్పందించాడు. పవిత్ర రంజాన్ మాసంలో షమీ రోజా (ఉపవాసం) పాటించకుండా పెద్ద నేరం చేశాడని అన్నాడు. రంజాన్ మాసంలో ఆరోగ్యకరమైన వ్యక్తి రోజా పాటించకపోతే నేరస్థుడవుతాడని తెలిపాడు. రంజాన్ మాసంలో ముస్లింలంతా రోజా పాటిస్తుంటే షమీ ఇలా చేయడమేంటని ప్రశ్నించాడు.
రోజా పాటించకుండా షమీ ప్రజల్లోకి తప్పుడు సందేశాన్ని పంపుతున్నాడని అన్నాడు. రోజా పాటించనందుకు షమీని క్రిమినల్తో పోల్చాడు. ఇలా చేసినందుకు షమీ దేవునికి సమాధానం చెప్పాలని ఓ వీడియో రిలీజ్ చేశాడు. షమీపై రజ్వీ చేసిన వ్యాఖ్యలపై క్రీడాభిమానులు మండిపడుతున్నారు. మతాన్ని క్రీడలతో ముడిపెట్టకూడదని అంటున్నారు. ఈ విషయంలో ముస్లిం సమాజంతో పాటు యావత్ దేశం షమీకి మద్దతుగా నిలుస్తుంది. షమీ ఈ విషయాన్ని పక్కన పెట్టి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్పై దృష్టి పెట్టాలని టీమిండియా అభిమానులు కోరుకుంటున్నారు.
సెమీస్లో ఆసీస్పై విజయం సాధించి భారత్ ఫైనల్కు చేరింది. మార్చి 9న జరిగే ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్ తో అమీతుమీ తేల్చుకుంటుంది. 2000 ఎడిషన్ (ఛాంపియన్స్ ట్రోఫీ) తర్వాత భారత్, న్యూజిలాండ్ ఫైనల్లో తలపడటం ఇదే మొదటిసారి. ఐసీసీ టోర్నీల ఫైనల్స్లో భారత్ తో తలపడిన రెండు సందర్భాల్లో న్యూజిలాండే విజేతగా నిలిచింది. 2000 ఎడిషన్ ఛాంపియన్స్ ట్రోఫీ, 2019-2021 డబ్ల్యూటీసీ ఫైనల్స్ లో న్యూజిలాండ్ భారత్ పై జయకేతనం ఎగురవేసి ఐసీసీ టైటిళ్లు ఎగరేసుకుపోయింది. ఈ నేపథ్యంలో ఆదివారం జరగబోయే ఫైనల్ కోసం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
Also Read : Jai Shankar: విదేశాంగ మంత్రి జైశంకర్ కార్యక్రమంలో ఖలిస్థాన్ నినాదాలు