Shashi Tharoor: రాహుల్ గాంధీ వ్యాఖ్యల్ని తప్పుబట్టిన శశిథరూర్
రాహుల్ గాంధీ వ్యాఖ్యల్ని తప్పుబట్టిన శశిథరూర్
Shashi Tharoor : భారత్, రష్యా సంబంధాలపై అక్కసు వెళ్లగక్కుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమర్థించడాన్ని సొంత పార్టీ ఎంపీ శశిథరూర్ (Shashi Tharoor) తప్పుబట్టారు. రాహుల్ వ్యాఖ్యలతో విభేదిస్తున్నానని చెప్పారు. భారత్, రష్యా ఆర్థిక వ్యవస్థలు ఇప్పటికే పతనమయ్యాయని, వాటిని మరింత దిగజార్చుకోనీయండంటూ ట్రంప్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ట్రంప్ విమర్శలను శశిథరూర్ కొట్టిపారేశారు. భారత ఆర్థిక స్థితి ఎలా ఉందో అందరికీ తెలుసన్నారు. ట్రంప్ను రాహుల్ సమర్థించడంపై పార్లమెంట్ వెలుపల మీడియా ప్రశ్నించగా ఈ మేరకు స్పందించారు.
Shashi Tharoor Key Comments on Rahul Gandhi
రష్యాతో భారత్ ఏం చేస్తుందన్న విషయాన్ని అసలు పట్టించుకోబోమని, వారిద్దరూ మునిగిపోతుంటే మాకెందుకని, మిగిలిన అందరి గురించి పట్టించుకుంటామని ట్రంప్ పోస్టు చేసిన విషయం తెలిసిందే. ‘‘భారత్తో స్నేహపూర్వక సంబంధాలున్నప్పటికీ.. ఆ దేశంతో స్వల్ప లావాదేవీలే ఉన్నాయి. ఆ దేశం విధిస్తున్న సుంకాలు ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్నాయి. ఉక్రెయిన్లో దాడులు ఆపాలని ప్రపంచమంతా గొంతెత్తి అరుస్తుంటే.. భారత్ మాత్రం రష్యా నుంచి ఆయుధాలను, ఇంధనాన్ని కొనుగోలు చేస్తోంది’’ అని ట్రంప్ చిర్రుబుర్రులాడారు. ఆ పోస్టుపై రాహుల్ స్పందిస్తూ.. భారత ఆర్థిక వ్యవస్థ పతనమైందంటూ ట్రంప్ నిజం మాట్లాడారని అన్నారు. దీనిపై అధికార పక్షం నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. కాంగ్రెస్కు చెందిన మరో ఎంపీ కార్తి చిదంబరం కూడా రాహుల్ వ్యాఖ్యలను సమర్థించలేదు. కానీ, ట్రంప్ ఓ సంప్రదాయేతర రాజకీయ నాయకుడంటూ చురకలు అంటించారు.
Also Read : Madras High Court: ప్రభుత్వ పథకాల్లో వాళ్ల పేర్లు, ఫొటోలు వాడొద్దు – మద్రాస్ హైకోర్టు
