Road Accident: రోడ్లు ప్రమాదంలో ఆలమూరు ఎస్సై, కానిస్టేబుల్ మృతి
రోడ్లు ప్రమాదంలో ఆలమూరు ఎస్సై, కానిస్టేబుల్ మృతి
Road Accident: తెలంగాణాలోని కోదాడ పట్టణ పరిధిలోని జాతీయ రహదారిపై దుర్గాపురం వద్ద గురువారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గుర్తుతెలియని వాహనాన్ని వెనుక నుంచి కారు ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న ఎస్సై, కానిస్టేబుల్ మృతి చెందారు. వీరు ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు పోలీసు స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న ఎస్సై అశోక్, కానిస్టేబుల్ వీరస్వామిగా గుర్తించారు.
గంజాయి కేసులో ముద్దాయిని పట్టుకోవడానికి అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు పోలీసు స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న ఎస్సై అశోక్, కానిస్టేబుల్ వీరస్వామి హైదరాబాద్ కు బయలుదేరారు. మార్గంమధ్యలో వీరు ప్రయాణిస్తున్న కారు కోదాడ పరిధిలో గుర్తుతెలియని వాహనాన్ని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎస్సై, కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు కావడంతో స్థానికులు కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
Road Accident – ఏపీ హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసుల మృతిపై ఏపీ హోంమంత్రి అనిత (Vangalapudi Anitha) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై జిల్లా ఎస్పీతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
రోడ్డు ప్రమాదంలో పోలీసుల మృతి బాధాకరం – సీఎం చంద్రబాబు
కేసు విచారణలో భాగంగా నిందితుల కోసం హైదరాబాద్ వెళ్తోన్న ఏపీ పోలీసులు కోదాడ వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం విషాదకరమని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రమాదంలో అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు ఎస్సై అశోక్, కానిస్టేబుల్ వీరస్వామిలు మరణించడం బాధాకరమన్నారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ స్వామి, డ్రైవర్ రమేష్లకు అందుతున్న వైద్య సాయంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. విధి నిర్వహణలో మృతి చెందిన పోలీసు కుటుంబాలకు, బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉండాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు సీఎం తెలిపారు.
Also Read : Pawan Kalyan: అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన గజేంద్రసింగ్ షెకావత్, పవన్ కల్యాణ్
