TTD EO : శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం
స్పష్టం చేసిన టీటీడీ ఈఓ ధర్మా రెడ్డి
TTD EO : శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుమల సిద్దమైంది. భక్తులకు ఇబ్బందులు రానివ్వమని స్పష్టం చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం కార్య నిర్వహణాధికారి ధర్మారెడ్డి(TTD EO).
భక్తులందరికీ సంతృప్తికరంగా ఉండేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఈ మేరకు వాహన సేవల దర్శనానికి ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.
డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో భక్తులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఇందులో భాగంగా టీటీడీ చేపట్టిన పలు కార్యక్రమాల గురించి భక్తులకు వివరించారు.
ఘనంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు(Srivari Brahmotsavam) నిర్వహిస్తామన్నారు. కరోనా కారణంగా రెండు సంవత్సరాలుగా బ్రహ్మోత్సవాలను నిర్వహించ లేక పోయామన్నారు ధర్మారెడ్డి.
కాగా ఈ నెల 27 నుంచి అక్టోబర్ 5 దాకా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. మాడ వీధులలో ప్రతి భక్తుడికి సంతృప్తికరంగా వాహన సేవల దర్శనం కల్పిస్తున్నట్లు చెప్పారు.
ఎన్ని ఇక్కట్లు ఎదురైనా సరే భక్తులకు దర్శనం కల్పించేందుకు కృషి చేస్తామన్నారు ఈవో. ఉత్సవాల సందర్భంగా 20న ఉదయం 6 నుంచి 11 గంటల మధ్య సంప్రదాయబద్దంగా ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తామన్నారు.
26న రాత్రి 7 నుండి 8 గంటల మధ్య అంకురార్పణ జరుగుతుందన్నారు. 27న ధ్వజారోహణం, రాత్రి పెద్ద శేష వాహనం చేపడతామన్నారు.
ఇదిలా ఉండగా ధ్వజారోహణం రోజున ప్రభుత్వం తరపున సీఎం జగన్ మోహన్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని ధర్మారెడ్డి చెప్పారు.
భక్తుల రద్దీ కారణంగా వీఐపీ బ్రేక్ దర్శనాలు, వృద్దులు, దివ్యాంగులు, చంటి పిల్లల పేరెంట్స్ , ఎన్ఆర్ఐలు, రక్షణ ప్రత్యేక దర్శనం , తదితర ప్రివిలైజ్జ్ దర్శనాలను రద్దు చేశామని చెప్పారు.
ఆర్జిత సేవలు, రూ. 300 టికెట్లతో పాటు శ్రీవాణి ట్రస్టు దాతలకు , ఇతర ట్రస్టుల దాతలకు దర్శన టికెట్లు రద్దు చేశామన్నారు.
Also Read : పంచాయతీరాజ్ శాఖలో పోస్టుల భర్తీ