Sundar Pichai: బెంగుళూరు టెకీ పోస్ట్ కు గూగుల్ సీఈఓ షాకింగ్ రిప్లయ్
బెంగుళూరు టెకీ పోస్ట్ కు గూగుల్ సీఈఓ షాకింగ్ రిప్లయ్
Sundar Pichai : భారత్ కు సంబంధించిన అనేక విషయాలను గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ (Sundar Pichai) ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ… సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. కృత్రిమ మేధ, క్రికెట్ వంటి వాటికి సంబంధించిన విషయాలను కూడా నెటిజన్లతో పంచుకుంటుంటారు. తాజాగా ఆయన చేసిన ఓ సోషల్ మీడియా పోస్టు వైరల్గా మారింది. ఓ టెకీ చేసిన పోస్టుకు ఏకంగా గూగుల్ సీఈఓనే స్పందించడంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు.
Sundar Pichai – అసలేమయ్యిందంటే ?
బెంగళూరుకు చెందిన అశుతోష్ శ్రీవాత్సవ అనే టెకీ తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టాడు. అందులో తన కుమారుడికి గాయమయ్యిందని తెలియడంతో వెంటనే ఆఫీస్ నుంచి ఆస్పత్రికి వచ్చానని… తలకు తీవ్రమైన గాయం కావడంతో చిన్నపాటి సర్జరీ కూడా చేయించాల్సి వచ్చిందని తెలిపాడు. అయితే ప్రస్తుతం కోలుకుంటున్నాడని పేర్కొన్నాడు. తలకు కట్టుతో ఉన్న తమ కుమారుడి ఫొటోను సైతం పోస్టు చేశాడు. టెకీ చేసిన పోస్టు చూసిన గూగుల్ సీఈఓ స్పందిస్తూ… చిన్నారికి ఏమీ కానందుకు తనకు సంతోషంగా ఉందన్నారు. అతడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
టెకీ పోస్టుకు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ స్పందించడంపై నెటిజన్లు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఓ నెటిజన్ స్పందిస్తూ.. సుందర్ పిచాయ్ ఎంత అత్యున్నత స్థానానికి చేరుకున్నా… ఎప్పటికీ ప్రజల మనిషిగానే ఉంటారని రాసుకొచ్చారు. పిచాయ్ గూగుల్ సీఈఓ స్థానంలో ఉన్నప్పటికీ చాలా సాధారణంగా, కలివిడిగా ఉంటారని మరో నెటిజన్ పేర్కొన్నారు.
Also Read : CAA: పాక్, బంగ్లా, అఫ్గాన్ మైనార్టీలకు ఊరట కల్పించిన కేంద్రం ప్రభుత్వం
