Supreme Court: ఏపీ లిక్కర్ స్కాంలో అనుమానితులకు సుప్రీంకోర్టు షాక్
ఏపీ లిక్కర్ స్కాంలో అనుమానితులకు సుప్రీంకోర్టు షాక్
ఏపీ మద్యం కుంభకోణంలో ముందస్తు బెయిల్ కోసం ధరఖాస్తు చేసిన అనుమానితులకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మాజీ సీఎం జగన్ కార్యదర్శి ధనుంజయ్రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్రెడ్డి, భారతీ సిమెంట్స్ పూర్తి కాలపు డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ పార్థివాలా నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఈ కేసుకు సంబంధించిన విచారణ హైకోర్టులో పెండింగ్ లో ఉన్నందున ఎలాంటి మధ్యంతర ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. అరెస్ట్ చేయకుండా ఉండేందుకు స్టే ఇవ్వాలని ఆ ముగ్గురి తరఫు న్యాయవాదులు కోరగా… దానికి ధర్మాసనం నిరాకరించింది. దీనితో ముగ్గురు నిందితులకు షాక్ తగిలినట్లయింది.
అయితే ఈ కేసులో అనుమానితులుగా పేర్కొన్న ఈ ముగ్గురిని అరెస్ట్ చేయబోం అని రాష్ట్ర ప్రభుత్వం స్టేట్మెంట్ ఇవ్వాలని నిందితుల తరఫు న్యాయవాదులు కోరగా… అలా ఇవ్వడం కుదరదని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు స్పష్టం చేశారు. ఈ క్రమంలో స్పందించిన జస్టిస్ పార్థివాలా.. తమ పరిధి, అధికారాల ప్రకారం నడుచుకునే స్వేచ్ఛ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. ఎల్లుండి జరిగే విచారణలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం హైకోర్టుకు సూచించింది. ఈ కేసుకు సంబంధించి మెరిట్స్ పై ఎలాంటి కామెంట్స్ చేయడం లేదని… నిర్ణయాధికారం హైకోర్టుదే అని సుప్రీంకోర్టు సృష్టం చేసింది. హైకోర్టులో విచారణ ముగిసి ఆదేశాలు ఇచ్చిన తర్వాత తదుపరి విచారణ చేపడతామని తెలిపింది.