Supreme Court: ఏపీ సీఐడీ మాజీ చీఫ్‌ సంజయ్ కు సుప్రీం కోర్టు నోటీసులు

ఏపీ సీఐడీ మాజీ చీఫ్‌ సంజయ్ కు సుప్రీం కోర్టు నోటీసులు

Supreme Court : ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అగ్నిమాపక విభాగంలో డీజీగా పనిచేసిన సమయంలో ఆయన అవినీతికి పాల్పడ్డారంటూ సంజయ్‌పై ఏపీ ప్రభుత్వం ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది. ఈ కేసులో సంజయ్‌ కు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీంలో(Supreme Court) ఏపీ సర్కార్ సవాల్ చేసింది. దీనిపై జస్టిస్ అమానుతుల్లా, జస్టిస్ పీకే మిశ్రాలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. సంజయ్ బెయిల్‌ ను రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్‌ కు కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా సంజయ్‌(Ex CID Chief Sanjay) కు సుప్రీం నోటీసులు ఇచ్చింది. నాలుగు వారాల్లో ఈ నోటీసులకు సమాధానం చెప్పాలంటూ… తదుపరి విచారణను నెలాఖరుకు వాయిదా వేసింది.

Supreme Court Given Notices to..

గత ప్రభుత్వ హయాంలో సీఐడీ చీఫ్ సంజయ్‌(Ex CID Chief Sanjay)… ఏ విధంగా నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారనే అంశాలను సుప్రీం కోర్టు ముందు ఏపీ ప్రభుత్వం ఉంచింది. సంజయ్‌ పై అప్పట్లోనే అవినీతి నిరోధక చట్టంలో పలు సెక్షన్ల కింద ఏసీబీ ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది. ఈ కేసులో ఏ1గా సంజయ్, ఏ2గా సౌత్రికా టెక్నాలజీస్‌ అండ్‌ ఇన్‌ఫ్రా, ఏ3గా క్రిత్వ్యాప్‌ టెక్నాలజీస్‌‌ను ఏసీబీ చేర్చింది. ఫైర్ డీజీగా విధులు నిర్వహించిన సమయంలో సంజయ్ ఈ అవినీతికి పాల్పడ్డారంటూ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఈ నివేదికను పరిశీలించిన తర్వాత సంజయ్‌పై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఆ తరువాత నివేదికను ఏసీబీకి పంపించింది. ప్రాథమిక సాక్షాధారాలు ఉండటంతో సంజయ్‌పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు.

అగ్నిమాపక శాఖలో ఆన్‌లైన్‌లో ఎన్‌వోసీలు జారీ చేసేందుకు అగ్ని-ఎన్వోసీ వెబ్‌సైట్, మొబైల్‌ యాప్‌ అభివృద్ధి, నిర్వహణ, 150 ట్యాబ్‌ల సరఫరా కాంట్రాక్టును సౌత్రికా టెక్నాలజీస్‌ అండ్‌ ఇన్‌ఫ్రా సంస్థకు సంజయ్‌(Ex CID Chief Sanjay) అప్పగించారు. అయితే అక్కడ ఎలాంటి పనులు జరగలేదు. కానీ ఆ సంస్థకు రూ. 59.93 లక్షల బిల్లులు చెల్లించారు. అదే విధంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంపైన దళితులు, గిరిజనులకు అవగాహన సదస్సు నిర్వహించేందుకు నిర్వాహణ కాంట్రాక్టును క్రిత్వ్యాప్ టెక్నాలజీస్‌కు కేటాయించి… అందుకు రూ.1.19 కోట్లు ఇచ్చారు. ఈ సదస్సులు మొత్తం కూడా సీఐడీ(CID) అధికారులే నిర్వహించారు. అయితే అసలు క్రిత్వ్యాప్ టెక్నాలజీస్‌ సదస్సు నిర్వహించనప్పటికీ బిల్లుల చెల్లించారు. దీనితో దొంగల లెక్కలు చూపించారంటూ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నివేదిక ఇవ్వగా… ఆ నివేదిక ఆధారంగా సంజయ్‌పై అధికార దుర్వినియోగం, అవినీతి కేసును ఏసీబీ నమోదు చేసింది. ఈ కేసులోనే సంజయ్‌కు సుప్రీం కోర్టు(Supreme Court) నోటీసులు జారీ చేసింది.

రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో సుప్రీం కీలక ఆదేశాలు

మాజీ ఎంపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. డాక్టర్ ప్రభావతి విచారణకు హాజరుకావాల్సిందే అని సుప్రీం తేల్చి చెప్పింది. 7, 8 తేదీల్లో జరిగే విచారణకు ప్రభావతి విచారణాధికారి ముందు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. విచారణకు సహకరించకపోతే మధ్యంతర రక్షణ రద్దు అవుతుందని న్యాయస్థానం తెలిపింది. విచారణకు ఎలా సహకరించడం లేదో అనే విషయాన్ని ప్రభుత్వ తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా సాక్షాలతో సహా కోర్టు ముందు ఉంచారు.

 

కస్టోడియల్ టార్చర్‌ లో రఘురామకు ఎలాంటి గాయాలు లేవంటూ అప్పట్లో గుంటూరు ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌గా ఉన్న డాక్టర్ ప్రభావతి నివేదిక ఇచ్చారు. ఆ నివేదికపై ప్రభుత్వం కేసు వేసింది. ప్రభుత్వం పెట్టిన కేసులో ముందస్తు బెయిల్ కావాలంటూ హైకోర్టును ప్రభావతి ఆశ్రయించారు. అయితే హైకోర్టులో ఆమెను నిరాశే ఎదురవడంతో… వెంటనే సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీంతో ప్రభావతికి సుప్రీం కోర్టు మధ్యంతర రక్షణ కల్పించడంతో పాటు విచారణకు హాజరుకావాల్సిందిగా గతంలో ఆదేశాలు జారీ చేసింది. అయితే విచారణకు హాజరుకావడం లేదని, విచారణకు సహకరించడం లేన్నందున గతంలో ఇచ్చిన మధ్యంతర రక్షణను తొలగించాలంటూ మరో పిటిషన్‌ను సుప్రీంలో ప్రభుత్వం దాఖలు చేసింది.

ఈ సందర్భంగా జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ కె.విశ్వనాథమ్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. అయితే ఒక్కసారి మాత్రమే విచారణకు పిలిచారని… మళ్లీ పిలవకుండా విచారణకు సహకరించడం లేదంటే ఎట్లా అంటూ ప్రభావతి తరపు న్యాయవాది వాదించారు. కానీ తాము ఇచ్చిన నోటీసులకు ప్రభావతి ఏ విధంగా స్పందించారు, గతంలో విచారణకు హాజరుకాలేమంటూ లాయర్ చేత సమాధానం ఇప్పటించారని, అలాగే తన భర్త చేత సమాధానం ఇప్పించారని… ఇలా ప్రతీసారి ఏదో ఒక సాకుతో ప్రభావతి విచారణకు హాజరుకావడంత లేదని.. అందువల్ల ఆమెకు ఇచ్చిన మధ్యంతర రక్షణను రద్దు చేయాలని ప్రభుత్వ తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదించారు.

దీనిపై ధర్మాసనం స్పందిస్తూ… ప్రభావతి విచారణకు సహకరించాలని ఆదేశించారు. ఈనెల 7, 8 తేదీల్లో ఉదయం 10 గంటలకు సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో విచారణాధికారి ముందు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. విచారణకు సహకరించకపోతే గతంలో ఇచ్చిన మధ్యంతర రక్షణ కోల్పోవాల్సి వస్తుందని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈనెల 15కు సుప్రీం కోర్టు వాయిదా వేసింది.

Also Read : Kodali Nani: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి వివరించిన అంబటి రాంబాబు

Leave A Reply

Your Email Id will not be published!