Tata Chairman: టాటా గ్రూపు ఉద్యోగులకు చైర్మెన్ భావోద్వేగ లేఖ

టాటా గ్రూపు ఉద్యోగులకు చైర్మెన్ భావోద్వేగ లేఖ

Tata Chairman : అహ్మదాబాద్‌ లో జరిగిన ఎయిర్ ఇండియా(Air India) విమాన ప్రమాదంపై టాటా గ్రూప్‌ చైర్మన్‌ నటరాజన్‌ చంద్రశేఖరన్‌ మరోసారి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జూన్‌ 12వ తేదీ అనేది టాటా గ్రూప్‌ చరిత్రలో చీకటి రోజుగా ఆయన అభివర్ణించారు. విమాన ప్రమాదం దర్యాప్తు అంశంలో పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ఎయిరిండియా ప్రయాణికుల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. ఎయిర్‌ ఇండియాను 2022లో తీసుకున్న టాటా గ్రూప్‌… తాజా విమాన ప్రమాదంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇంతటి ప్రాణనష్టం అనేది చాలా అపారమైన నష్టంగా చంద్రశేఖరన్‌ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం టాటా గ్రూప్‌ ఉద్యోగులకు ఆయన సుదీర్ఘ లేఖ రాసారు.

‘‘నిన్న(గురువారం, జూన్‌ 12) జరిగిన దుర్ఘటన అనేది మాటల్లో చెప్పలేనిది. ఇది చాలా కఠిన సమయం. నిన్న జరిగిన ఘటన వర్ణించలేనిది. మేమందరం ఇంకా షాక్‌లోనే ఉన్నాం. మనకు తెలిసిన ఓ వ్యక్తిని కోల్పోతేనే ఎంతో బాధపడతాం. కానీ, ఒకేసారి ఇంతమంది చనిపోవడం నిజంగా జీర్ణించుకోలేనిది. టాటా గ్రూపు చరిత్రలో ఇదో చీకటి రోజు. ఈ మాటలు ప్రస్తుతం ఓదార్పును ఇవ్వలేవు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబీకులకు, గాయాలతో బాధపడుతున్న వారికి అండగా నిలుస్తాం. అక్కడ ఏం జరిగిందో అనే విషయాన్ని మీలాగే మేమూ తెలుసుకోవాలని అనుకుంటున్నాం. ప్రస్తుతానికి సమాచారం లేకున్నా.. తప్పుకుండా అన్ని విషయాలు తెలుస్తాయి. దీనిపై దర్యాప్తు చేపట్టిన అన్ని స్వదేశీ, విదేశీ బృందాలకు మేము పూర్తిగా సహకరిస్తాం. అత్యంత పారదర్శకతతో దర్యాప్తునకు సహకారం అందిస్తాం’’ అని టాటా గ్రూపు ఛైర్మన్‌ పేర్కొన్నారు.

Tata Chairman – పారదర్శకంగా దర్యాప్తు

ప్రమాద ఘటనపై దర్యాప్తు జరిపేందుకు బ్రిటన్‌, అమెరికా నుంచి దర్యాప్తు బృందాలు అహ్మదాబాద్‌కు చేరుకున్నాయని, వారికి తమ నుంచి పూర్తి సహకారం ఉంటుందని చంద్రశేఖరన్‌ (Natarajan Chandrasekaran) పేర్కొన్నారు. సమాజం పట్ల బాధ్యత విషయంలో టాటా గ్రూపు నిక్కచ్చిగా ఉంటుందని, దర్యాప్తులో వెల్లడయ్యే విషయాలపైనా పూర్తి పారదర్శకంగా ఉంటామని స్పష్టం చేశారు. ప్రమాదానికి సంబంధించిన విషయాలను తెలుసుకునేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తున్నారని, ఈ క్రమంలో ఎన్నో ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. అయితే, అందులో కొన్ని సరైనవి, కొన్ని తప్పు కావచ్చని.. ఏదేమైనా కొంత సహనంతో ఉండాలని విజ్ఞప్తి చేశారు.

ఎంత నష్టాన్నైనా భరిస్తాం

ఈ ఘోర ప్రమాదంపై దర్యాప్తులో వాస్తవాలు తెలుస్తాయని, వాటిని తెలియజేయడంలో పూర్తి పారదర్శకత ప్రదర్శిస్తామని టాటా గ్రూపు ఛైర్మన్‌ హామీ ఇచ్చారు. విశ్వాసం, సంరక్షణ అనే ప్రాతిపదికతోనే ఈ గ్రూపు నిర్మితమైందన్న ఆయన… కష్టకాలమైనప్పటికీ బాధ్యతల నుంచి, ఏది సరైందో అది చేయడంలో వెనక్కి తగ్గబోమన్నారు. తాము ఎయిర్‌ ఇండియాను తీసుకున్నప్పట్నుంచీ ప్రయాణికులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నామని, ఇందులో ఎటువంటి రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. ఈ నష్టాన్ని తాము కూడా భరిస్తామని, వీటిని ఎన్నటికీ మరచిపోమంటూ ఉద్యోగులకు రాసిన లేఖలో చంద్రశేఖరన్‌ వెల్లడించారు.

Also Read : Air India Insurance: ఎయిర్ ఇండియా విమానంకు ఇన్సూరెన్స్ ఎంత వస్తుందో తెలుసా ?

Leave A Reply

Your Email Id will not be published!