TATA Group: మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ప్రకటించిన టాటా గ్రూప్
మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ప్రకటించిన టాటా గ్రూప్
TATA Group : అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై ఎయిరిండియా యాజమాన్యమైన టాటా గ్రూప్(TATA Group) స్పందించింది. మరణించిన వ్యక్తుల కుటుంబాలకు పరిహారం ప్రకటించింది. కోటి రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియాగా అందించనున్నట్లు వెల్లడించింది. గాయపడిన వారి వైద్య ఖర్చులను కూడా తామే భరిస్తామని తెలిపింది. ఈ మేరకు టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు.
TATA Group Announced Compensation
‘‘ఎయిరిండియా ప్రమాద ఘటన మమ్మల్ని తీవ్రంగా కలచివేసింది. ఆ బాధను వ్యక్తపరచడానికి మాటలు కూడా రావడం లేదు. ప్రమాదంలో ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఈ విషాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి వ్యక్తి కుటుంబానికి టాటా గ్రూప్ తరఫున రూ.1కోటి అందజేయనున్నాం. గాయపడిన వారి వైద్య ఖర్చులను కూడా మేమే భరిస్తాం. వారి సంరక్షణ బాధ్యత కూడా మాదే. బీజే మెడికల్ హాస్టల్ నిర్మాణానికి మా వంతుగా తోడ్పాటు అందిస్తాం’’ అని చంద్రశేఖరన్ పేర్కొన్నారు. ఈ ఘటనపై ఎయిరిండియా ఎండీ, సీఈఓ క్యాంప్బెల్ విల్సన్ తీవ్ర విచారం వ్యక్తంచేశారు.
విమాన ప్రమాదం దర్యాప్తుకు రంగంలోకి ‘ఏఏఐబీ’
విమాన ప్రమాదంపై దర్యాప్తు చేయనున్నట్లు పౌరవిమానయాన శాఖ వర్గాలు వెల్లడించాయి. అటు ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) రంగంలోకి దిగింది. ఏఏఐబీ డీజీ, ఇతర అధికారులు ఘటనాస్థలానికి బయల్దేరారు. ప్రమాదానికి గల కారణాలపై వారు సమీక్ష చేపట్టనున్నారు.
Also Read : Air India: అహ్మదాబాద్ లో కుప్పకూలిన ఎయిరిండియా విమానం ! 242 మంది మృతి !