Tejashwi Yadav: ఓటర్ల జాబితా సవరణపై తేజస్వీ యాదవ్ సంచలన వ్యాఖ్యలు
ఓటర్ల జాబితా సవరణపై తేజస్వీ యాదవ్ సంచలన వ్యాఖ్యలు
Tejashwi Yadav : బీహార్ లో ఓటర్ల జాబితా సవరణపై రాష్ట్ర ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీహార్ ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయి. ఏ సీట్లో ఏ పార్టీ గెలవాలో ఈసీ నిర్ణయిస్తోంది. అందుకే అసెంబ్లీ ఎన్నికల్ని బహిష్కరించే యోచనలో ఉన్నాం. ఇండియా కూటమితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు.
ఈ సందర్భంగా తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) మీడియాతో మాట్లాడుతూ… ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పేరుతో జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను ఎన్డీఏ ప్రభుత్వం తమకు అనుకూలంగా మలచుకుంటోంది. నిజమైన ఓటర్లను తొలగిస్తూ, తప్పుడు ఓటర్ల జాబితాలను రూపొందిస్తున్నారని అన్నారు. ఇంతకుముందు ఓటర్లు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఓటర్లను ఎంచుకుంటోంది’అని వ్యాఖ్యానించారు. కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా ఈసీ పనిచేస్తోంది. ఎన్నికలు మోసపూరితంగా జరుగుతున్నాయని భావిస్తున్నామని.. అందుకే ఎన్నికలను బహిష్కరించే యోచనలో ఉన్నామన్నారు. అలయన్స్ పార్టీలతో చర్చించి, ప్రజాభిప్రాయం తీసుకున్న తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
Tejashwi Yadav – పాపులర్ సీఎం ఫేస్ తేజస్వి, వెనుకబడిన నితీష్
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు తరుముకొస్తున్న వేళ రాష్ట్రీయ జనతా దళ్ కు ఓ సర్వే చల్లటి కబురు చెప్పింది. బీహార్ తదుపరి సీఎంగా ఎవరైతే బాగుంటుందనే విషయంలో తేజస్వి యదవ్ (Tejashwi Yadav) వైపే ఆ రాష్ట్ర ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని, ఆ తరువాత స్థానంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఉన్నారని ఆ సర్వే పేర్కొంది. మూడో స్థానంలో జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపడు ప్రశాంత్ కిషోర్ ఉన్నట్టు వెల్లడించింది. ‘ఓట్ వైబ్’ ఈ సర్వే నిర్వహించింది.
సర్వే ఫలితాల ప్రకారం, సీఎం విషయంలో తేజస్వికి 32.1 శాతం ప్రజలు అనుకూలంగా అభిప్రాయం వ్యక్తం చేశారు. 25 శాతం ప్రజలు నితీష్ వైపు, 12.4 శాతం ప్రజలు ప్రశాంత్ కిషోర్ వైపు మొగ్గుచూపారు. ప్రశాంత్ కిషోర్ తరువాత నాలుగో స్థానంలో లోక్ జనశక్తి పార్టీ సుప్రీం చిరాగ్ పాశ్వాన్ నిలిచారు. ఆయన వైపు 9.4 శాతం ప్రజలు మొగ్గుచూపారు.
యువకుల్లో తేజస్వికి మంచి పాపులారిటీ ఉన్నట్టు సర్వే తెలిపింది. ఆయన ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని 25-34 సంవత్సరాల మధ్య ఉన్న 40 శాతం మంది యువకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. 22 మంది నితీష్ వైపు మొగ్గుచూపారు. అయితే, 55 ఏళ్లు పైబడిన 32.4 శాతం మంది ముఖ్యమంత్రిగా నితీష్ కొనసాగాలని కోరుకోగా, ఈ ఏజ్ గ్రూప్కు చెందిన 19.4 శాతం మంది తేజస్విని కోరుకున్నారు.
సుదీర్ఘకాలంగా సీఎంగా ఉన్న నితీష్కు ఆదరణ తగ్గుతోందనే ప్రచారం కొద్దికాలంగా జరుగుతున్న క్రమంలో తాజా సర్వే వెలువడింది. అయితే బీజేపీ మాత్రం నితీష్ సారథ్యంలోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తామని చెబుతోంది. నితీష్ తరచు పార్టీలు మారుస్తుంటారనే అభిప్రాయం ఉన్నప్పటికీ ఇక అలాంటిదేమీ జరగదని, తాను ఇక ఎన్నటికీ ఎన్డీయేలోనే ఉంటానని నితీష్ పలుమార్లు ప్రకటించారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఎన్నికల కమిషన్ ఇంకా ప్రకటించనప్పటికీ షెడ్యూల్ ప్రకారం అక్టోబర్-నవంబర్ మాసాల్లో ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి.
Also Read : IRCTC: జనరల్ క్లాస్ ప్రయాణీకులకు భారతీయ రైల్వే శుభవార్త
