Telugu Lessons: పంజాబ్ ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు పాఠాలు
పంజాబ్ ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు పాఠాలు
Telugu Lessons : కేంద్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు పంజాబ్ లోని ప్రభుత్వ పాఠశాలల్లో మే 26వ తేదీ నుంచి వారం రోజుల పాటు ఉపాధ్యాయులు వేసవి శిబిరాలు నిర్వహించారు. ఈ క్యాంపులకు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు హాజరయ్యారు. అయితే ఈ క్యాంపులో విద్యార్ధులకు తెలుగు పాఠాలను(Telugu Lessons) చెబుతున్నారు. వారికి టీచర్స్ యూట్యూబ్ లో చూసి తెలుగు వర్ణమాల నేర్పించారు. తెలుగులో కూరగాయల పేర్లు, పండ్లు, వంటకాలు ఇలా చాలా వాడుకపదాలను విద్యార్ధులు నేర్చుకున్నారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…
కేంద్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు దేశంలోని అన్ని సర్కారీ బడుల్లో భారతీయ భాషా వేసవి శిబిరాలను నిర్వహించారు. ఇందులో భాగంగానే పంజాబ్లోని(Punjab) ప్రభుత్వ పాఠశాలల్లో వేసవి శిబిరాలు ఏర్పాటు చేశారు. ఆ క్యాంపుల్లో హాజరైన విద్యార్థులకు టీచర్లు తెలుగు నేర్పిస్తున్నారు. విద్యార్థులకు తెలుగు ఓనమాలు నేర్పించి, పాఠాలు బోధించారు. పంజాబ్ రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి పర్యవేక్షణలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు తెలుగు బోధన సాగింది. పంజాబీ విద్యార్థులకు బోధించాల్సిన తెలుగు బేసిక్స్ మెటీరియల్ను కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్’ ప్రాజెక్టు పరిధిలోని తెలుగు నోడల్ అధికారి సమకూర్చారు.
Telugu Lessons – నేర్పిన పాఠాలు ఇవే..
అలాగే తెలుగు భాషలోని ప్రముఖ దేశభక్తి గేయాలను విద్యార్థులతో పాడించారు. వాటి అర్థాన్ని ఉపాధ్యాయులు వివరించారు. బస్సు మీద ఉన్నపేర్లు ఎలా చదవాలి.. ఆయా వివరాలు ఎలా తెలుసుకోవాలి.. తదితర మెయిన్ సిలబస్గా విద్యార్థులకు టీచర్లు నేర్పించారు. ఆయా పేర్లను విద్యార్థులతో చదివించి, రాయించారు. ఇంకా తెలుగు భాషలోని నమస్కారం, ధన్యవాదాలు, అభినందనలు వంటి గౌరవపూర్వక పదాల గురించి తెలియజేసి.. తెలుగు రాష్ట్రాలకు వెళితే ఆటో డ్రైవర్లు, బస్సు కండక్టర్లు, డ్రైవర్లు, వ్యాపారులను తెలుగులో ఎలా సంబోధించాలి అనేది కూడా నేర్పించారు.
తెలుగు భాషా తరగతులను నిర్వహించే క్రమంలోనే విద్యార్థులకు డిజిటల్ (యూట్యూబ్) మెటీరియల్తో పాటు ప్రింటెడ్ మెటీరియల్ను కూడా పంపిణీ చేశారు. వాటిని చూస్తూ విద్యార్థులు తమ తమ ఇళ్ల వద్ద ప్రాక్టీస్ చేసి, ప్రత్యేక లెర్నింగ్ షీట్లను రూపొందించారు. అయితే పంజాబ్లోని పలు ఉపాధ్యాయ సంఘాలు కేంద్ర విద్యాశాఖ ఆదేశాలను వ్యతిరేకిస్తున్నాయి. కాగా నెటిజన్లు మాత్రం ఈ చర్యను అభినందిస్తున్నారు. పిల్లలు రెండు మూడు బాషలు మాట్లాడడం చాలా బాగుంటుందని అంటున్నారు.
Also Read : Union Minister Pemmasani : భారత దేశ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది