హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. డార్లింగ్ ప్రభాస్ నటించిన ది రాజా సాబ్, మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వర ప్రసాద్ గారు చిత్రాలు సంక్రాంతి పండుగ సందర్బంగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ సందర్బంగా టికెట్ల రేట్లు పెంచుకునేందుకు తమకు అవకాశం ఇవ్వాలని కోరుతూ ఆయా సినిమాల నిర్మాతలు హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే ఏపీ సర్కార్ తీపి కబురు చెప్పింది. అయితే గత కొంత కాలంగా ఈ సినిమా టికెట్ రేట్ల పెంపు వ్యవహారంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. పలువురు సామాజిక వేత్తలు, జర్నలిస్టులు, సినీ క్రిటిక్స్ సైతం తప్పు పడుతున్నారు. ఎవరి మేలు కోసం వీటిని పెంచుతున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. అసలు ప్రభుత్వం ఉన్నది ప్రజల కోసమా లేక భారీ ధరలు పెంచి ప్రేక్షకులు, అభిమానులను లూటీ చేస్తున్న వారి పక్షం ఎందుకు వహిస్తున్నదంటూ పెద్ద ఎత్తున నిలదీస్తున్నారు.
ఈ తరుణంలో బుధవారం ది రాజా సాబ్, మన శంకర వర ప్రసాద్ గారూ సినిమాలకు సంబంధించిన టికెట్ రేట్ల పెంపు నకు సంబంధించిన కేసును విచారణ చేపట్టింది హైకోర్టు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేసింది. చావు కబురు చల్లగా చెప్పింది. సినిమా టికెట్ల ధరల పెంపుపై నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వానికే వదిలేస్తున్నట్లు ప్రకటించింది ధర్మాసనం. ప్రభాస్ , చిరంజీవి నటించిన చిత్రాల టికెట్ల ధరల పెంపు అభ్యర్థనలో జోక్యం చేసుకోవడానికి డివిజన్ బెంచ్ నిరాకరించింది. కాగా ది రాజా సాబ్ , మన శంకర వర ప్రసాద్ గారు చిత్రాల టాలీవుడ్ చిత్రాల నిర్మాతలు గత ఏడాది డిసెంబర్ 9న సింగిల్ జడ్జి ఇచ్చిన మునుపటి ఉత్తర్వును సవరించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఆ చిత్రాలకు టికెట్ల ధరలను పెంచడాన్ని సింగిల్ జడ్జి నిషేధించారు.
