ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు ప‌శు సంవ‌ర్ధ‌క రంగం ఆధారం

స్ప‌ష్టం చేసిన మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు

అమ‌రావ‌తి : ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు ప‌శు సంవ‌ర్ధ‌క రంగం ఆధారంగా ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు రాష్ట్ర ప‌శు, వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజార‌పు అచ్చెన్నాయుడు. సోమ‌వారం విజయవాడ రూరల్ మండలంలోని నిడమానూరు గ్రామంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంత‌రం జ‌రిగిన స‌భ‌లో ప్ర‌సంగించారు. 2024 ఎన్నిక‌ల అనంత‌రం 13,257 గ్రామాల్లో జన్మభూమి తరహాలో పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం జ‌రిగింద‌ని చెప్పారు. 10.48 లక్షల పశువులకు ఉచిత వైద్య సేవలు, 5.36 లక్షల పశు పోషకులకు ప్రత్యక్ష లబ్ధి చేకూరింద‌న్నారు. అదే స్ఫూర్తితో 2026 జనవరి 19 నుంచి 31 వరకు రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఉచిత‌ పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నాం అన్నారు.

పశుసంవర్ధక రంగం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు బలమైన వెన్నెముక అని పేర్కొన్నారు అచ్చెన్నాయుడు. దేశంలో 2వ స్థానంలో గొర్రెలు, మేకల సంఖ్య, గ్రుడ్ల ఉత్పత్తిలో ప్రథమ స్థానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంద‌న్నారు. సుమారు 25 లక్షల రైతు కుటుంబాలు పశుపోషణపై ఆధారపడి జీవిస్తున్నాయని చెప్పారు. వారి భద్రతే కూట‌మి ప్రభుత్వ లక్ష్యం అని స్ప‌ష్టం చేశారు. శాస్త్రీయ పశు యాజమాన్యంపై అవగాహన కల్పించి ఉత్పాదకత పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నాం అన్నారు కింజ‌రాపు అచ్చెన్నాయుడు. రూ.52 కోట్లతో 50% రాయితీపై పశుదాణా పంపిణీ , పశుపోషణ ఖర్చులు తగ్గించడం జ‌రిగింద‌న్నారు. రూ.28.32 కోట్లతో 75% రాయితీపై పశుగ్రాస విత్తనాలు, గ్రామాల్లో స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేస్తున్నామ‌న్నారు.

ఇప్పటి వరకు 58,440 గోకులాల షెడ్లు నిర్మించామ‌ని చెప్పారు. 2026–27లో మరో 50 వేల లక్ష్యంగా పెట్టుకున్నామ‌న్నారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్ అనుసంధానంతో 3 లక్షల ఎకరాల్లో 100% రాయితీపై పశుగ్రాస సాగు, ఈ క్రాప్ కూడా చేయిస్తామని అన్నారు. పశువుల అకస్మిక మరణంలో పశుపోషకుడికి భరోసా ఇచ్చేలా 85% రాయితీపై పశుబీమా పథకం అమలు చేస్తున్నామ‌న్నారు. రాష్ట్రంలోని 2.32 కోట్ల గొర్రెలు, మేకలకు ఏడాదికి నాలుగు సార్లు ఉచిత నట్టల నివారణ మందులు పంపిణీ చేశామ‌న్నారు.

Leave A Reply

Your Email Id will not be published!