YSRCP MLC: వైసీపీకు బిగ్ షాక్ ! టీడీపీలో చేరిన ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు !
వైసీపీకు బిగ్ షాక్ ! టీడీపీలో చేరిన ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు !
YSRCP MLC : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే వైసీపీకి (YSRCP) రాజీనామా చేసిన ముగ్గురు ఎమ్మెల్సీలు… బల్లి కల్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్ శుక్రవారం అధికారికంగా తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ ముగ్గురు నేతలు గుంటూరు జిల్లా ఉండవల్లిలో టీడీపీ అధినేత, సీఎం నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. వైసీపీకి చెందిన ఈ ముగ్గురు ఎమ్మెల్సీలు ఇటీవలే తమ పార్టీకి, ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. కాగా, వారి రాజీనామా లేఖలు శాసనమండలి ఛైర్మన్ వద్ద పెండింగ్ లో ఉన్నాయి.
YSRCP MLC – టీడీపీతోనే అభివృద్ధి – మర్రి రాజశేఖర్
ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి చూసే టీడీపీలో (TDP) చేరామన్నారు. ఆరు నెలలుగా కౌన్సిల్ చైర్మన్ తమ రాజీనామాలు ఆమోదించలేదని, దాని వెనుక ఆయనకు ప్రత్యేక అజెండా ఉందని పేర్కొన్నారు.
సొంత గూటికి వచ్చినట్టు ఉంది – బల్లి కల్యాణ్
టీడీపీలో చేరడం సొంత గూటికి వచ్చినట్టు ఉందని బల్లి కల్యాణ్ పేర్కొన్నారు. తన నాన్న పూర్తికాలం టీడీపీతోనే ఉన్నారని, బేషరతుగానే టీడీపీలో చేరామని కల్యాణ్ స్పష్టం చేశారు.
ఏమీ చేయలేకపోయాం – కర్రి పద్మశ్రీ
వైసీపీ పదవికి, పార్టీకి రాజీనామా చేసి ఏడాది ముగిసిందన్నారు కర్రి పద్మశ్రీ. పదవి ఉన్నా ప్రజలకు పెద్దగా ఏమీ చేయలేకపోయామని, వైసీపీ కనీసం మీడియాతో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
హైస్కూల్ను దత్తత తీసుకున్న రామ్మోహన్ నాయుడు ! హర్షం వ్యక్తం చేసిన లోకేశ్ !
శ్రీకాకుళం ఏడు రోడ్ల కూడలిలో దశాబ్దాల చరిత్ర ఉన్న ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ను కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు దత్తత తీసుకోవడంపై మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు ‘ఎక్స్’ వేదికగా అభినందనలు తెలిపారు. రామ్మోహన్ నాయుడు మాదిరిగానే ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, దాతలు, పూర్వ విద్యార్థులు, ఎన్ఆర్ఐలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తమ పరిధిలోని పాఠశాలల అభివృద్ధికి చేయూతనందించాలని కోరారు. అందరం కలిసి ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ను తీసుకొచ్చి రాష్ట్ర విద్యా వ్యవస్థను దేశానికే ఆదర్శంగా నిలుపుదామన్నారు.
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శుక్రవారం ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ను సందర్శించారు. క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించి.. అక్కడ ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులతో భేటీ అయ్యారు. దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ పాఠశాలను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. దీనిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. విషయం తెలసుకున్న మంత్రి లోకేశ్.. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రికి అభినందనలు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలకు ప్రభుత్వం కూడా పూర్తి తోడ్పాటు అందిస్తుందని చెప్పారు.
Also Read : Election Commission: ఓట్లు తొలగింపుపై రాహుల్ ఆరోపణలను ఖండించిన ఈసీ
